ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో నారా బ్రాహ్మణి యాక్టివ్ అవుతారంటూ వార్తలు వస్తున్నా, ఆమె మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేదు.కేవలం హెరిటేజ్, ఇతర వ్యాపార వ్యవహారాలు మాత్రమే చూసుకుంటూ వస్తున్నారు.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉంది.అధికార పార్టీ ఒకవైపు దూకుడుగా ముందుకు వెళుతుండటం, అడుగడుగునా టిడిపి నాయకులను టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తుండటంతో పార్టీ సీనియర్ నాయకులే కాకుండా ఈ కింది స్థాయి నాయకుల వరకు ఆందోళనలో ఉన్నారు.
ఈ దశలో చంద్రబాబు ఒక్కరే పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కష్టపడుతున్నారు.ఏడు పదుల వయసులో కూడా తన శక్తికి మించి పార్టీ కోసం నిత్యం కష్టపడుతూ, ప్రజా ఉద్యమాలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
చంద్రబాబు రాజకీయ వారసుడిగా లోకేష్ ఉన్నా ఆయన పనితీరుపై చంద్రబాబుకు, ఆ పార్టీ నాయకులకు పెద్దగా నమ్మకం లేకపోవడంతో చంద్రబాబు తర్వాత రాజకీయ ప్రత్యామ్నాయం ఎవరు అనేది చాలా కాలంగా ప్రశ్నగానే ఉంటూ వస్టగొంది.తాజాగా టిడిపిలోకి నారా బ్రాహ్మణిని యాక్టివ్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.తాజాగా హైదరాబాద్ లో చంద్రబాబు నివాసంలో టిడిపి తరఫున సోషల్ మీడియాలో పోరాడుతూ, పార్టీకి మైలేజ్ తీసుకువచ్చే విధంగా వ్యవహరిస్తున్న కొంతమంది కీలకమైన సోషల్ మీడియా యాక్టివిస్ట్ లకు నారా బ్రాహ్మణి ఆధ్వర్యంలో విందు ఏర్పాటు చేశారు.
ఈ విందులో నారా బ్రాహ్మణి బాగా యాక్టివ్ గా కనిపించడంతో పాటు సోషల్ మీడియా యాక్టివిస్ట్ లకు పలు సూచనలు చేయడంతో పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సోషల్ మీడియాలో ఏ విధంగా యాక్టివ్ గా ఉండాలి అనే విషయాలపై పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
మొన్న విశాఖలో చంద్రబాబుకు జరిగిన అవమానం, అడ్డంకులు, ఇబ్బందులు అన్నిటిని సోషల్ మీడియా టిడిపి సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళింది.దీంతో పార్టీకి కూడా బాగా మైలేజ్ పెరిగినట్టు గుర్తించారు.
అందుకే ముందుగా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అవ్వాలని, దీనికి నారా బ్రాహ్మణి సారథ్యం వహించబోతున్నట్టు సమాచారం.
భవిష్యత్తులోనూ, ముందు ముందు పార్టీ కార్యక్రమాలను, ప్రజా ఉద్యమాల్లోనూ, ఆందోళనల్లోనూ బ్రాహ్మణి పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా టిడిపి వర్గాల ద్వారా తెలుస్తోంది.ప్రస్తుతం చంద్రబాబు తర్వాత టిడిపిని లీడ్ చేసేది ఎవరు అనే సందేహాలు పార్టీ నాయకులతోపాటు, ప్రజల్లోనూ ఉండడంతో నారా బ్రాహ్మణి తనకు ప్రత్యామ్నాయంగా తీసుకురావాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.