కొద్ది రోజుల క్రితం ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబం గురించి వ్యక్తిగతంగా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కొంతమంది పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ పెద్ద సంచలనం గానే మారాయి.దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించడంతో పాటు, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సందర్భంగా ప్రజల్లోనూ ఈ విషయంపై చర్చకు తెరలేపారు.
అలాగే లోకేష్ సైతం ఇదే అంశంపై జనాల్లో చర్చ జరిగేలా చేస్తున్నారు.వైసీపీ ప్రభుత్వం పై దుమ్మెత్తి పోస్తున్నారు.
ఇదే వ్యవహారంలో జూనియర్ ఎన్టీఆర్ పైన పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులు విమర్శలు చేస్తున్నాయి.ఈ వ్యవహారం ఇక సద్దుమణుగుతుంది అనుకుంటున్న సమయంలో, ఈ పరిణామాలపై చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు.
ఈ మేరకు ఒక లేఖను ఆమె విడుదల చేశారు.
తనకు జరిగిన అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల నిరసన వ్యక్తం చేసిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు అంటూ ఆమె లేఖలో పేర్కొన్నారు.తనకు జరిగిన అవమానం నీ తల్లికి తోబుట్టువు కి కూతురికి జరిగినట్లుగా భావించి తనకు అండగా నిలబడడం మరిచిపోలేనని లేఖలో ప్రస్తావించారు.
చిన్నతనం నుంచి తన అమ్మగారు, నాన్నగారు తమను విలువలతో పెంచారని గుర్తు చేశారు. నేటికీ తాము వాటిని పాటిస్తూనే ఉంటామని లేఖలో భువనేశ్వరి పేర్కొన్నారు.విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడాలని కోరారు.ఎవరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, ఎవరి గౌరవానికి భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించ కూడదని , తనకు జరిగిన అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని ఆ లేఖలో ప్రస్తావించారు.
ప్రస్తుతం భువనేశ్వరి రాసిన లేఖ వైరల్ గా మారింది.