టాలీవుడ్ యంగ్ హీరోల్లో జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస అవకాశాలతో బిజీగా ఉన్న హీరోల్లో నాని ఒకరు.తన సినిమాల్లో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉండేలా చూసుకునే నాని తన 28వ సినిమాలో హీరోయిన్ గా మల్లూ బ్యూటీ నజ్రియా నజీమ్ ను ఎంచుకున్నారు.
గతంలో చాలామంది దర్శకులు నజ్రియాకు టాలీవుడ్ సినిమాల్లో ఛాన్సులు ఇచ్చినా ఆమె ఎందుకో టాలీవుడ్ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపలేదు.
రాజారాణి అనే తమిళ డబ్బింగ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నజ్రియా నజీమ్ ఆ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.
నాని 25వ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలై డిజాస్టర్ ఫలితాన్ని అందుకోగా నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరామ్ సినిమాల్లో నటిస్తున్నారు.ఈ సినిమాల తరువాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నాని 28వ సినిమా తెరకెక్కుతోంది.
మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలతో కమర్షియల్ విజయాలు సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్న వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.దీపావళి కానుకగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రకటించగా ఈ నెల 21వ తేదీన టైటిల్ ను ప్రకటించనున్నారు.
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.హీరోయిన్ గా నజ్రియాను ప్రకటించడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి.
గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న నజ్రియా చాలాకాలం తరువాత ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ నాని 28వ సినిమాకు క్రేజీ కాంబినేషన్ ను సెట్ చేసి మరో హిట్ ను ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమవుతోంది.