ఎన్టీఆర్ కుమారుడు, హీరో నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
కారు అదుపుతప్పి బోల్తా పడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి.చికిత్స నిమిత్తం నార్కెట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు.
పరిస్థితి విషమించడంతో మృతిచెందారు.మరో నాలుగు రోజుల్లో (సెప్టెంబర్ 2) తన పుట్టిన రోజును జరుపుకోనున్న హరికృష్ణ ఇలా అర్థాంతరంగా మృతిచెందటంతో నందమూరి కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.
పుట్టినరోజు నేపథ్యంలో అభిమానులను ఉద్దేశించి హరికృష్ణ ఓ లేఖ రాశారు.ముందుగా రాసి పెట్టుకున్న ఈ లేఖ ఆయన మరణించిన తర్వాత బయటపడింది.‘సెప్టెంబర్ 2న 62వ పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరపవద్దని నా మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేస్తున్నాను.మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, కేరళ రాష్ట్రంలో వరదలు, వర్షాలు కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.
వేల మంది నిరాశ్రయులైనారు.ఇది మన అందరికీ ఎంతో విషాదాన్ని కలిగించే విషయం.
అందువల్ల నా జన్మదినం సందర్భంగా బేనర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, పుష్ప గుచ్ఛాలు, దండలు తీసుకురావద్దని వాటికి అయ్యే ఖర్చును వరదలు, వర్షాలు కారణంగా నష్టపోయిన కుటుంబాలకు అందజేయాలని కోరుతున్నాను.అంతేకాకుండా, నిరాశ్రయులైన వారికి దుస్తులు, వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు మీ శక్తి మేరకు అందజేయాలని కోరుచున్నాను.
ఇట్లు- మీ నందమూరి హరికృష్ణ’ అంటూ ఆ లేఖలో హరికృష్ణ పేర్కొన్నారు.