జై అమరావతి అనే నినాదాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నాయి.ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి నుంచి రాజధాని వేరే ప్రాంతానికి తరలించడానికి వీల్లేదంటూ ఆ ప్రాంత రైతులు, ప్రజలతో పాటు వైసీపీ రాజకీయ ప్రత్యర్థులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.
జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసన దీక్షలు ఇప్పటికే 20 రోజులు దాటింది.ప్రభుత్వం రాజధాని విషయంలో మాట, మనసు మార్చుకునేందుకు సిద్ధంగా లేకపోవడంతో అమరావతి పరిరక్షణ వేదిక పేరుతో జేఏసీ ఏర్పాటు చేసి ఈ ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేశారు.
ఇక్కడ చేపట్టిన నిరసన దీక్షకు టిడిపి అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరి స్వయంగా హాజరవడం, ఆ ప్రాంత రైతులు చేస్తున్నఆందోళనకు మద్దతు పలకడం, దీని కారణంగా టిడిపికి పొలిటికల్ మైలేజ్ పెరగడం ఇవన్నీ జరిగాయి.
ఇక సినీ పరిశ్రమ నుంచి నారా రోహిత్, అశ్వినీదత్, సింగర్ స్మిత, దర్శకుడు సతీష్ వేగేశ్న తదితరులు జై అమరావతి అనే నినాదానికి మద్దతు పలికారు.అయితే అమరావతి వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నా, సినీ హీరో కమ్ ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ మాత్రం ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు ప్రత్యక్షంగా ముందుకు రాకపోవడంపై అనేక విమర్శలు వ్యక్తమయ్యాయి.దీనిపై ఆలోచనలో పడ్డ బాలయ్య రేపు అమరావతి ప్రాంతంలో కుటుంబ సమేతంగా పర్యటించేందుకు సిద్దం అవుతున్నారు.
బాలయ్యతో పాటు ఆయన భార్య వసుంధర, కుమార్తె బ్రాహ్మణి రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించి అక్కడ రైతులు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలపడంతో పాటు తుళ్లూరు, వెలగపూడి, మందడం తదితర గ్రామాల్లో ఉన్న రైతుల నిరాహారదీక్ష శిబిరాలను సందర్శిస్తారట.అక్కడ అమరావతి గురించి బాలయ్య తన స్పందనను తెలియజేసి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేయబోతున్నట్టు తెలుస్తోంది.తాను ఇప్పటి వరకు అమరావతి ఉద్యమంలోకి ఎందుకు రాలేకపోయాను అనే విషయంపై ఇక్కడ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.ఇక ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేసే అవకాశం ఉండడంతో రాజకీయ దుమారం చెలరేగే అవకాశం కనిపిస్తోంది.
అయితే ఈ విషయంలో ప్రభుత్వం, పోలీసులు ఏ విధంగా స్పందిస్తార, బాలయ్య పర్యటనకు ఏదైనా ఆంక్షలు విధిస్తారా అనేది తేలాల్సి ఉంది.