దేశంలో, తెలుగు రాష్టాల్లో పైరసీ సినిమా రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తోంది.సినిమా మార్నింగ్ షో పూర్తికాక ముందే ఒరిజినల్ క్వాలీటీకి దాదాపు సమానమైన క్వాలిటీతో పైరసీ ప్రింట్ నెట్టింట దర్శనమిస్తోంది.
ఫలితంగా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లడంతో పాటు సినిమా భవిష్యత్తే ప్రమాదంలో పడే పరిస్థితి నెలకొంది.పైరసీ వల్ల నిర్మాతలకు కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతోంది.
తాజాగా నందమూరి బాలకృష్ణ పైరసీ భూతాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.శ్రేయాస్ ఈటీ ద్వారా బాలకృష్ణ నటించిన నర్తనశాల సినిమా 17 నిమిషాల నిడివితో ఈరోజు ఉదయం విడుదలైన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా బాలయ్య తెలుగు ప్రేక్షకులకు, అభిమానులకు వందనాలు తెలుపుతూ పైరసీని అరికట్టాలని.ప్రేక్షకులంతా ఎంతో అప్రమత్తంగా ఉంటే మాత్రమే పైరసీని అరికట్టడం సాధ్యమవుతుందని తెలిపారు.
ప్రతి ఒక్క అభిమానిపై పైరసీని అరికట్టాల్సిన బాధ్యత ఉందని.అభిమానులు శ్రేయాస్ ఈటీ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని ఎన్బీకే థియేటర్ ద్వారా సినిమాను చూడాలని కోరారు.
బాలయ్య ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులకు, అభిమానులకు ఈ మేరకు సందేశం ఇచ్చారు.సీనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో బాలకృష్ణకు నర్తనశాల సినిమా అంటే ఎంతో ఇష్టం.
ఆ ఇష్టం వల్లే ఈ సినిమాను రీమేక్ చేయాలని 16 సంవత్సరాల క్రితం బాలయ్య సంకల్పించారు.
బాలకృష్ణ, సౌందర్య, శ్రీహరి, శరత్ బాబు ప్రధాన పాత్రల్లో నటించగా సౌందర్య మరణం వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.
అప్పట్లో షూట్ చేసిన ఫుటేజీని 17 నిమిషాల నిడివి ఉన్న సినిమాగా మలిచి ఈ సినిమాను విడుదల చేశారు.పైరసీ భూతాన్ని తరిమికొట్టేందుకు తమ వంతు కృషి చేస్తామని బాలయ్య అభిమానులు సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు.
ఈ సినిమా ద్వారా వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని బాలయ్య సేవా కార్యక్రమాల కోసం వినియోగించనున్నారు.