2019 ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా జరుగుతాయో ? ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకుంటారో ? కూడా అర్థం కాని పరిస్థితి.ఏపీలో టీడీపీ-బీజేపీ బంధం తెగిపోయింది.
తెలంగాణలోనూ, ఏపీలోనూ బీజేపీ, టీడీపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి.ఇక కొద్ది రోజులుగా టీడీపీ – కాంగ్రెస్ పొత్తు గురించి ప్రధానంగా తెలుగు రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.
అసలు కాంగ్రెస్ పార్టీ నిరంకుశ వైఖరి, నియంతృత్వ విధానంతో పాటు ఆ పార్టీ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తుంగలో తొక్కుతుందనే విమర్శతోనే నాడు ఎన్టీఆర్ టీడీపీ స్థాపించారు.ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే టీడీపీ పుట్టింది.
కట్ చేస్తే ఇప్పుడు టీడీపీ పుట్టాక మూడున్నర దశాబ్దాల తర్వాత తెలుగు రాజకీయాలు ఒక్కసారిగా మారాయి.తెలుగు జాతి రెండు రాష్ట్రాలుగా విడిపోయింది.టీడీపీకి రెండు దశాబ్దాలుగా నమ్మకమైన మిత్రుడిగా ఉన్న బీజేపీతో ఇప్పుడు తీవ్రమైన వైరం ఏర్పడింది.దీంతో ఏపీలో ఓ వైపు అధికారం నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తుండడంతో పాటు మరోవైపు తెలంగాణలో పార్టీ ఉనికిని నిలుపుకోవాల్సిన అవసరం చంద్రబాబుకు ఏర్పడింది.
ఏపీలోనూ వచ్చే ఎన్నికల్లో పార్టీకి పొత్తుల ఆవశ్యకత ఉంది.
పార్టీ అధికారంలో ఉన్న ఏపీలోనే ఇలా ఉంటే ఇక పార్టీ పతనదశలో ఉన్న తెలంగాణలో పొత్తులు లేకుండా పోటీ చేస్తే టీడీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఇప్పటికే తెలంగాణలో సీనియర్లు అందరూ తమ దారి తాము చూసుకున్నారు.ఇప్పటికే మోత్కుపల్లి నర్సింహులు లాంటి వారు అయితే పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసేయాలని చెప్పారు.
ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకోవాలని కొందరు నాయకులు చంద్రబాబుకు సూచించినట్టు వార్తలు వచ్చాయి.
ఇక ఇప్పుడు అక్కడ మిగిలిన ఒకటీ అరా నాయకులు కూడా కాంగ్రెస్తో పొత్తుకు సానుకూలంగా ఉంటున్నారు.
వచ్చే ఎన్నికల్లోనూ, ఆ తర్వాత పార్టీని బతికించుకోవాలంటే కాంగ్రెస్తో కలిసి వెళ్లాల్సిందే అని వారు పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది.తాజాగా ఇదే అంశంపై టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు కూడా పరోక్షంగా ఇదే వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో 2019 ఎన్నికల్లో టీడీపీ సహకారం లేకుండా ఏఒక్క పార్టీ కూడా ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదన్నారు.టీడీపీని గౌరవించే పార్టీతో పొత్తులు ఉంటాయని ఆయన తెలిపారు.
తమతో పొత్తుకు కాంగ్రెస్ కూడా ముందుకు వస్తుందని, ఆ విషయాన్ని కూడా ఆలోచిస్తామని తెలిపారు.
ఇక ఇప్పటికే టీ కాంగ్రెస్ పెద్దలు కూడా తమ అంతర్గత సంభాషణలతో పాటు ఇతరత్రా మీటింగుల్లో టీడీపీతో పొత్తుపై సూచనాభిప్రాయంగా చెప్పేస్తున్నారు.
ఇప్పుడు నామా నాగేశ్వరరావు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.ఈ పరిణామాలను బట్టి చూస్తుంటే 2019 ఎన్నికల్లో టీడీపీ – కాంగ్రెస్ పొత్తు ఉండే ఛాన్సులే ఎక్కువుగా కనిపిస్తున్నాయి.
అయితే ఈ పొత్తులు తెలంగాణలో ఓకే… మరి ఏపీలో సంగతేంటన్నది అర్థం కావడం లేదు.
ఏపీని అడ్డగోలుగా విభజించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది, అనాథలా వదిలేసింది కాంగ్రెస్సే అని టీడీపీ విమర్శలు చేస్తూ వచ్చింది.
నాడు కాంగ్రెస్ తల్లిని చంపేస్తే, ఇప్పుడు బీజేపీ బిడ్డను చంపిందని టీడీపీ రెండు జాతీయ పార్టీలను టార్గెట్ చేస్తూ వచ్చింది.ఇప్పుడు అదే కాంగ్రెస్తో కలిస్తే అది చారిత్రకంగానే పెద్ద సంచలనం అవుతుంది.
ఏ పార్టీని వ్యతిరేకిస్తూ టీడీపీ పుట్టిందో ఇప్పుడు అదే పార్టీతో పొత్తు అంటే అది తెలుగు రాజకీయాల్లోనే ప్రకంపనలు రేపుతుంది.మరి ఏం జరుగుతుందో ? చూడాలి.