ఈ మధ్య కాలంలో సమాజంలో చోటు చేసుకుంటున్న ఘటనలు ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.కొన్ని ఘటనల్లో చిన్నచిన్న విషయాలకే కలత చెంది విద్యార్థులు, యువత ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మరి కొన్ని ఘటనల్లో క్షణికావేశానికి లోనై కొందరు అవతలి వ్యక్తులకు హత్య చేస్తున్నారు.
తాజాగా మహారాష్ట్ర రాష్ట్రంలో కోడిగుడ్డు కూర ఒక వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణమైంది. మద్యం మత్తులో ఉన్న మరో వ్యక్తి కోడిగుడ్డు కూర వండలేదని తన స్నేహితుడిని దారుణంగా హత్య చేశాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని నాగపూర్ లోని ముంకాపూర్ లో బనార్సీ అనే వ్యక్తి నివశించేవాడు.అతనికి గౌరవ్ గైక్వాడ్ అనే ప్రాణ స్నేహితుడు ఉన్నాడు.వీళ్లిద్దరూ వీకెండ్ లో కలిసి మందు తాగేవారు.అలా నిన్న రాత్రి కూడా బనార్సీ గైక్వాడ్ ను ఇంటికి ఆహ్వానించాడు.
కొంత సమయం పాటు బనార్సీ, గైక్వాడ్ ఆఫీస్ విషయాలను, ఇతర విషయాలను మాట్లాడుకున్నారు.
ఆ తరువాత ఇద్దరూ కలిసి పీకల దాకా మద్యం తాగారు.
అనంతరం భోజనం చేయడానికి బనార్సీ గైక్వాడ్ ను పిలిచాడు.ఆ సమయంలో గైక్వాడ్ తనకు కోడిగుడ్డు కూర అంటే ఎంతో ఇష్టమని అది వండిపెట్టాలని బనార్సీని కోరాడు.
అయితే ఇంట్లో కోడిగుడ్లు లేకపోవడం వల్ల , అర్ధరాత్రి కావడం వల్ల గుడ్డు కూర చేయడం సాధ్యం కాదని బనార్సీ గైక్వాడ్ కు చెప్పాడు.దీంతో గైక్వాడ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు.
ఇంట్లో ఉన్న ఇనుప రాడ్డుతో బనార్సీపై గైక్వాడ్ దాడి చేశాడు.తలను ఇనుపరాడ్డు బలంగా తాకడంతో బనార్సీ అక్కడికక్కడే మృతి చెందాడు.మద్యం మత్తులో దాడి చేయడంతో స్నేహితుడు చనిపోయడని గ్రహించిన గైక్వాడ్ అతని మృతదేహాన్ని సమీపంలోని గ్యారేజ్ దగ్గర పడేసి అక్కడినుంచి పరారయ్యాడు.పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.