దుబ్బాక, ఆ వెంటనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కారు పార్టీకి తిరుగులేని దెబ్బ తగిలింది.దుబ్బాక ఉప ఎన్నికల్లో కంచుకోటను కోల్పోయిన షాక్ నుంచి గులాబీ పార్టీ తేరుకోక ముందే గ్రేటర్ ఎన్నికల్లో ఏకంగా 100 సీట్లు సాధిస్తామని బీరాలు పోయిన గులాబీ పార్టీ చివరకు ఎక్స్ అఫీషియో ఓట్లతో కూడా గ్రేటర్ పీఠం దక్కించుకోలేని పరిస్థితికి దిగజారింది.
దీంతో ఇప్పుడు త్వరలో జరిగే నాగార్జునా సాగర్ ఉప ఎన్నిక మీదే ఉంది.నాగార్జునా సాగర్ సీటు కూడా టీఆర్ఎస్ సిట్టింగ్ సీటే.
ఈ సీటును కూడా కోల్పోతే తెలంగాణలో టీఆర్ఎస్ మరింత డేంజర్లోకి వెళ్లిపోతోందన్న సంకేతాలు బలంగా వచ్చేస్తాయి.
దీంతో నాగార్జునా సాగర్ లో ఎవరికి సీటు ఇవ్వాలన్న దానిపై టీఆర్ఎస్ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది.
ఇక ఇప్పటికే అక్కడ మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుటుంబానికి సీటు ఇవ్వాలా ? లేదా ? ఇతర వ్యక్తులను రంగంలోకి దించాలా ? అనే దానిపై టీఆర్ఎస్ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది.ఇప్పటికే పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
ఇక ఇప్పుడు ఈ లిస్టులోకే టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మామ ప్రభాకర్ రెడ్డి పేరు తెరమీదకు వచ్చింది.
2014 ఎన్నికల్లోనే ఆయన ఇబ్రహీంపట్నం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.ఆ తర్వాత ఆయన రాజకీయంగా వెనకపడిపోయారు.ఇప్పుడు నాగార్జునా సాగర్ వాళ్ల సొంత నియోజకవర్గం కావడంతో అక్కడ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నట్టు తెలుస్తోంది.
ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే టీఆర్ఎస్ పరిస్థితి ఏంటన్న దానిపై ఇప్పటికే ఆయన ఓ సర్వే కూడా చేయించుకున్నారని అంటున్నారు.ఈ సర్వే ఫలితాన్ని బట్టే ఆయన ఇక్కడ సానుకూలత ఉంటే కేసీఆర్ను కలిసి సీటు అడగాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
అయితే కేసీఆర్ మాత్రం దుబ్బాక దెబ్బతో సాగర్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.మరి ఫైనల్గా టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు అవుతారో ? చూడాలి.