అక్కినేని నాగార్జున, స్నేహ, బేబి యాని ప్రధాన పాత్రల్లో తెలంగాణ రజాకార్ల ఉద్యమానికి సంబంధించిన కథతో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కి 2011లో రాజన్న సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించారు.
అయితే సినిమా కథ, కథనం బాగానే ఉన్నా నాగార్జున, స్నేహ పాత్రల పరిధి తక్కువగా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.
అక్కినేని నాగార్జున ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించగా ఈ సినిమాకు పెద్దగా లాభాలు రాలేదు.
అయితే తొమ్మిదేళ్ల తర్వాత ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతూ ఉండటంతో వార్తల్లో నిలిచింది.తమిళనాడు రాష్ట్రంలో రాజన్న సినిమా డబ్బింగ్ వెర్షన్ క్రిస్ మస్ పండుగ కానుకగా విడుదల కానుంది.
విప్లవవీరుడి పాత్రలో నాగార్జున నటించిన ఈ సినిమా రాజసింగమ్ పేరుతో తమిళంలో విడుదలవుతోంది.
తమిళనాడు రాష్ట్రంలో కొన్ని వారాల క్రితమే థియేటర్లు ఓపెన్ అయ్యాయి.అయితే అక్కడ విడుదల చేయడానికి సినిమాలు లేకపోవడంతో తెలుగు డబ్బింగ్ సినిమాలపై అక్కడి థియేటర్ల ఓనర్లు సైతం ఆసక్తి చూపుతున్నారు.లక్ష్మీ లోటస్ మూవీ బ్యానర్ పై ఈ సినిమా తమిళంలో విడుదల కానుంది.
తమిళ నిర్మాత ప్రసాద్ తమిళనాడు ప్రేక్షకులకు చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలు నచ్చుతాయని అందువల్లే ఈ సినిమాను తమిళంలో విడుదల చేస్తున్నామని అన్నారు, తెలుగులో అనుకున్న స్థాయిలో ఫలితాన్ని అందుకోలేకపోయిన రాజన్న తమిళంలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.యూట్యూబ్ లో రాజన్న తెలుగు వెర్షన్ అందుబాటులో ఉండటం, తెలుగులో రిలీజైన చాలా సంవత్సరాల తర్వాత తమిళంలో విడుదలవుతుండటంతో రాజసింగమ్ భారీ కలెక్షన్లను రాబడుతుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.