కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు వ్యవహారం రచ్చరచ్చగా మారిన సంగతి తెలిసిందే.అసలు ఉన్నట్టుండి నాగబాబు ఒక్కసారిగా వివాదాస్పద అంశాలను తెరపైకి తేవడం, మహాత్మా గాంధీని చంపిన గాడ్సే గురించి, ఆయన్ని పొగుడుతూ వ్యాఖ్యలు చేయడం వంటివి పెద్ద దుమారం రేపాయి.
ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అభాసుపాలయ్యారు.ఇదే విషయమై స్పందించిన పవన్ నాగబాబు వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని, దీంట్లో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు.
అయితే నాగబాబు అకస్మాత్తుగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వెనుక కారణాలు ఏంటనేది లోతుగా పరిశీలిస్తే చాలా విషయాలు బయటికి వస్తున్నాయి.ఇప్పటికే జనసేనకి స్పష్టమైన సిద్ధాంతాలు ఏవీ లేవు అనేది జనాల్లో ఉన్న అభిప్రాయం.
దానికి తోడు ఇప్పుడు నాగబాబు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు మరింత గందరగోళం సృష్టిస్తూ పార్టీ నాయకులను కూడా అయోమయానికి గురిచేస్తున్నాయి.నాగబాబు వ్యాఖ్యలు పార్టీకి సంబంధం లేదని ఎంత చెబుతున్నా, ఆ ప్రభావం ఖచ్చితంగా పార్టీపై పడుతుంది.అయితే ఉన్నట్టుండి ఈ విధమైన వ్యాఖ్యలు సాదాసీదాగా అయితే చేయలేదనే విషయం ఇప్పుడు బయటకి వస్తోంది.బీజేపీ, ఆర్.ఎస్.ఎస్ ని ప్రసన్నం చేసుకునేందుకు నాగబాబు ఈ విధంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.బిజెపి గాడ్సేను కీర్తిస్తూ ఉంటుంది.అంతేకాకుండా నాథురం గాడ్సే ఆర్ ఎస్ ఎస్ మనిషి.అందుకే ఇప్పుడు నాగబాబు జనసేనకు ఆర్ఎస్ఎస్ దగ్గర క్రెడిట్ వచ్చే విధంగా చేసేందుకు ఈ వ్యవహారాన్ని తలకెత్తుకున్నట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.అందుకే హఠాత్తుగా నాగబాబు గాడ్సే గొప్ప దేశభక్తుడు అంటూ పొగిడారు.
గాంధీ ని గాడ్సే ఎందుకు చంపారు అనేదానిపై చర్చించాలని చెప్పారు.తాను గాడ్సే చేసిన నేరాన్ని సమర్ధించడం లేదని, కానీ అప్పట్లో మీడియా ఆయన వెర్షన్ ను సరిగ్గా చూపించలేకపోయింది అంటూ మాట్లాడారు.
అదీకాకుండా జనసేన కు కమ్యూనిజం , చేగువేరా ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.కానీ బీజేపీ, ఆర్.ఎస్.ఎస్ కు ఆ విషయాలు అస్సలు నచ్చవు.పైగా ఈ కారణాలతో జనసేనను దూరం పెట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.అందుకే బిజెపి ఆర్ఎస్ఎస్ లను ప్రసన్నం చేసుకునేందుకు నాగబాబు ఈ విధంగా పోస్టింగ్ పెడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బీజేపీకి దగ్గరవ్వాలంటే అది ఆర్ఎస్ఎస్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందనే విషయాన్ని గ్రహించిన జనసేన పెద్దలు ఇప్పుడు నాగబాబు అస్త్రాన్ని వదిలినట్లు గా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకున్నా రెండు పార్టీల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉండడంతో ఇప్పుడు ఈ విధంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది.