ప్రశ్నించడానికే పుట్టాం ప్రశ్నిస్తూనే ఉంటాం అది పార్టీ సిద్ధాంతం అంటూ పదే పదే చెబుతూ ఉంటారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.ఇప్పటికే ఎన్నో సార్లు గత ప్రభుత్వాన్ని, ప్రస్తుత ప్రభుత్వాన్ని పవన్ ప్రశించారు.
ఇక్కడివరకు ఎవరికీ ఎటువంటి అభ్యన్తరాలు లేవు.ఎందుకంటే ముందు నుంచి పవన్ చెబుతుంది ఇదే కాబట్టి.
కానీ తాజాగా జనసేన పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న సమావేశాల్లో పార్టీ ఓటమి గురించి, పటిష్టత గురించి, రాబోయే రోజుల్లో పార్టీ స్టాండ్ ఎలా ఉండాలి ఇలా అనేక అంశాల గురించి లోతుగా చర్చించుకుంటున్నారు.ఈ సందర్భంగా పవన్ సోదరుడు నాగుబాబు మాట్లాడుతూ పార్టీలో పవన్ ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరూ ప్రశ్నించవద్దంటూ కాస్త ఘాటుగానే వార్నింగ్ ఇచ్చారు.
ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు అధినేతకు విధేయుడు అనిపించుకోరని, పవన్ ఏం చెప్పినా గుడ్డిగా అనుసరిస్తూ ముందుకు వెళ్ళేవారే నిజమైన విధేయుడు అనిపించుకుంటారు అంటూ చెప్పటంతో పార్టీలో కలకలం రేగింది.ఎందుకంటే ఇప్పటికే పవన్ ఒంటెత్తు పోకడలను ప్రశ్నిస్తున్నవారి సంఖ్య పార్టీలో రోజురోజుకి పెరుగుతోంది.మొన్నటి ఎన్నికల్లో జనసేన పోటి చేసిన 140 సీట్లలో కేవలం ఒక్కసీటు మాత్రమే గెలుచుకోగలిగింది.అప్పటి నుంచి పార్టీ శ్రేణుల్లో అభద్రతా భావం ఎక్కువయిపోయింది.దీని కారణంగానే ఒక్కొక్కరుగా పార్టీకి రాజీనామాలు చేస్తూ తమకు అనుకూలంగా ఉండే పార్టీల్లో చేరిపోతున్నారు.అదే సమయంలో అద్దేపల్లి శ్రీధర్ వంటి నాయకులు పవన్ నాయకత్వాన్నే ప్రశ్నిస్తున్నట్లుగా లేఖలు కూడా రాస్తున్నారు.
దీంతో పార్టీలో అంతర్గతంగా ఉన్న గొడవలన్నీ బజారున పడుతున్నాయి.
దీని కారణంగా జనసేన లో మిగిలి ఉన్న నాయకుల్లో కూడా టెన్షన్ పెరిగిపోతూ వస్తోంది.
అయితే ఈ విషయాలన్నింటిని దృష్టిలో ఉంచుకునే పవన్ సోదరుడు నాగబాబు అందరికీ ఈ రేంజ్ లో వార్నింగ్ లు ఇస్తున్నట్టు కనిపిస్తోంది.పవన్ ఏ నిర్ణయం తీసుకున్నా అది లోక కళ్యాణం కోసమే అన్నట్టుగా నాగబాబు వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి.
పవన్ నిర్ణయాలను తాను ఎప్పటికీ ప్రశ్నించనని కాబట్టి మిగిలిన వారు కూడా ప్రశ్నించకూడదని ఆయన చెబుతున్నారు.తాను అవసరం అయితే పవన్ తో కలిసి మునిగిపోతానని నాగబాబు చెబుతున్నాడు.
పవన్ సోదరుడు కాబట్టి నాగబాబు మునిగినా తేలినా ఒక అర్ధం ఉంటుంది.కానీ మిగతావారు కూడా మునిగిపోవాలనే విధంగా నాగబాబు ధోరణి ఉండడం జనసేన మీద విమర్శలకు కారణం అవుతోంది.
పైనా ప్రశ్నిస్తాను అని చెప్పే పార్టీ మీద ప్రశ్నలే ఉండకూడదు అనడం ఎంతవరకు న్యాయం ?
.