హుజురాబాద్ బై పోల్ను అధికార టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి అందరికీ విదితమే.ఈ క్రమంలోనే ‘దళిత బంధు’ స్కీమ్ను పైలట్ ప్రాజెక్టుగా నియోజకవర్గంలో ఈ నెల 16న సీఎం కేసీఆర్ లాంచ్ చేయబోతున్నారు.
ఇకపోతే టీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడబోయే అభ్యర్థిని సీఎం కేసీఆర్ తాజాగా ప్రకటించారు.టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను హుజురాబాద్ బరిలో నిలిపింది గులాబీ పార్టీ.
వీణవంక మండలం హిమ్మత్ నగర్ వాస్తవ్యుడైన గెల్లు శ్రీనివాస్ యాదవ్కు విద్యార్థి నేతగా మంచి గుర్తింపు ఉంది.టీఆర్ఎస్ పార్టీ తరఫున మాత్రమే కాకుండా విద్యార్థిగా ఉన్నపుడు ఉద్యమకారుడిగా పలు కార్యక్రమాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన గెల్లుకు హుజురాబాద్ టికెట్ ఇవ్వడం పట్ల గెల్లు అనుచరులు, వీణవంక వాస్తవ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సంగతులు ఇలా ఉండగా, అధికార టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ తరఫున బరిలో ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్కు ప్రస్తుతం గెల్లు రాజకీయ ప్రత్యర్థిగా నిలవబోతున్నారు.అయితే, ఒకనాడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తండ్రి గెల్లు మల్లయ్య యాదవ్ కూడా ఈటలకు ప్రత్యర్థిగా ఉండటం విశేషమనే చెప్పొచ్చు.2004లో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ తరఫున కమలాపూర్ నుంచి పోటీ చేయగా, ఆయనకు ప్రత్యర్థిగా నాడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఫాదర్ మల్లయ్య పోటీ చేశారు.అయితే, ఆ తర్వాత క్రమంలో ఈటలకు మద్దతు పలికి పోటీ నుంచి విత్ డ్రా అయ్యారు మల్లయ్య.
తాజాగా హుజురాబాద్లో జరగనున్న ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉండబోతున్నారు.ఇప్పటికే ఉన్న రాజకీయ పరిస్థితుల ప్రకారం టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే సీన్ ఉంటుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
చూడాలి మరి.పింక్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రచారం ఎలా ఉండబోతుందో.