అధికారికంగా ప్రకటించకపోయినా, జనసేన ,టిడిపి పార్టీల పొత్తు ఖరారు అయ్యింది అనే విషయం అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ప్రజల్లోనూ చర్చనీయాంశం అవుతోంది.దాదాపు పొత్తు విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య ఇప్పటికే ఒక అవగాహన వచ్చిందని, ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని విడివిడిగా ఎదుర్కోవడం కంటే, ఉమ్మడిగా ఎదుర్కొంటూనే అధికారానికి దూరం చేయవచ్చని అభిప్రాయంతోనే ఈ పొత్తు విషయంలో సీరియస్ గా ఆలోచిస్తున్నారట.
జనసేన టిడిపి పొత్తు ఖరారు అయితే జనసేన కోరినన్ని సీట్లు ఇచ్చేందుకు టిడిపి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపిస్తోంది.ఇప్పటికే ఈ వ్యవహారం పై ఒక క్లారిటీ కూడా వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
అసలు జనసేన బీజేపీతో పొత్తు తెగతెంపులు చేసుకుని టిడిపి వైపు వెళ్లేందుకు పవన్ కు ఇష్టం లేదట.కానీ రాజకీయ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే భయం పవన్ లో ఉన్నా, జనసేనలో కీలకంగా వ్యవహరిస్తున్న నాదెండ్ల మనోహర్ ఒత్తిడితోనే పవన్ ఈ స్టెప్ తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం జనసేన పార్టీలో పవన్ తర్వాత నాదెండ్ల మనోహర్ మాత్రమే కీలకంగా వ్యవహరిస్తున్నారు.గతంలో మాదాసు గంగాధరం వంటి వారు కీలకంగా వ్యవహరించారు .ఆ తరువాత బయటకి వెళ్లిపోయారు.అలాగే రాజోలు నుంచి జనసేన తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సైతం పార్టీకి దూరంగా ఉండడానికి కారణం నాదెండ్ల మనోహర్ వ్యవహార శైలి కారణం అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.
ఇదిలా ఉంటే జనసేన టిడిపి పొత్తు విషయంలో నాదెండ్ల మనోహర్ పవన్ పై ఒత్తిడి తీసుకువస్తున్నారట.
ప్రస్తుతం పార్టీ ఉన్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా , 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని, మళ్లీ 2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ అయితే, జనసేన పార్టీ పూర్తిగా మూసుకోవాల్సి పరిస్థితి ఏర్పడుతుందని, అందుకే టిడిపి తో పొత్తు పెట్టుకోవాలని ఒత్తిడి పెంచుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.గత కొద్ది రోజులుగా పవన్ ప్రసంగాలలో ఎక్కువగా కులాల అంశాలను ప్రస్తావిస్తున్నారు.ఆ సామాజిక వర్గంను ఆకట్టుకునేందుకు ప్రయత్నించడం వెనుక కారణం కూడా ఇదేననేది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.