టాలీవుడ్లో అత్యంత భారీ బడ్జెట్ పెట్టి మరీ స్టార్ హీరోల సినిమాలు చేస్తున్న నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారారు లీకు రాయుళ్లు.తమ సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ సింగిల్ సాంగ్, టీజర్ పలానా తేదీన రిలీజ్ చేస్తున్నామని ప్రకటించే నిర్మాణ సంస్థలకు అదిరిపోయే షాకిస్తున్నారు లీకు రాయుళ్లు.
వారు చెప్పిన సమయానికంటే కొన్ని గంటల ముందే అవి నెట్టింట్లో ప్రత్యక్షమవుతున్నాయి.దీంతో వారు తలలు పట్టుకుంటున్నారు.
తాజాగా ఈ కోవలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప, సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రాలు కూడా ఉన్నాయి.ఇటీవల పుష్ప చిత్రం నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించగా, వారు దాన్ని రిలీజ్ చేసే లోపే పాటలోని కొన్ని షాట్స్, బీట్స్ ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి.
ఇక మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట బ్లాస్టర్ గ్లింప్స్కు కూడా ఇదే తరహా సమస్య ఎదురయ్యింది.నిర్మాతలు చెప్పిన సమయానికంటే ముందే అది ఆన్లైన్లో ప్రత్యక్షం అవ్వడంతో వారు ఖంగుతిన్నారు.
దీంతో వారు ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యారు.ఈ మేరకు వారు తాజాగా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
తాము అత్యంత కష్టపడి తెరకెక్కిస్తున్న చిత్రాలకు సంబంధించి కొన్ని లీకులు జరుగుతున్నాయని, కొందరు దుర్మార్గులు వాటిని లీకు చేసి పైశాచికానందం పొందుతున్నారని వారు తెలిపారు.ఈ అంశంపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామని, త్వరలోనే నేరస్థులను పట్టుకుని వారికి తగిన శాస్తి చేస్తారని ఆశిస్తున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ తమ ప్రకటనలో తెలిపింది.
అభిమానులు, ప్రేక్షకులు దయచేసి ఇలాంటి పైరసీని ఎంకరేజ్ చేయొద్దంటూ వారు కోరారు.