యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఆ సినిమా చిత్రీకరణ సందర్బంగా ఎన్టీఆర్ గాయపడ్డాడు అని, యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్ చల్ చేసింది.
ఎన్టీఆర్ స్వల్ప గాయాలతో ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లుగా పుకార్లు షికారు చేశాయి.దాంతో నందమూరి ఫ్యాన్స్తో పాటు తెలుగు ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు కూడా ఆందోళన చెందారు.
ఎన్టీఆర్ యోగ క్షేమాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేశారు.అయితే అవన్ని ఒట్టి పుకార్లు మాత్రమే అని తేలిపోయింది
ఎన్టీఆర్ ‘జనతగ్యారేజ్’ చిత్రం షూటింగ్లో గాయపడ్డట్లుగా మీడియాలో వస్తున్న వార్తలు పుకార్లు మాత్రమే అని, అలాంటిది ఏమీ జరగలేదు అని, ఎన్టీఆర్ క్షేమంగా ఉండి, ప్రస్తుతం చిత్రం షూటింగ్లో హుషారుగా పాల్గొంటున్నాడు అంటూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ ట్విట్టర్లో పేర్కొంది.
నిర్మాణ సంస్థకు చెందిన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఈ ట్వీట్ చేశారు.దాంతో ఫ్యాన్స్ అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు.
‘నాన్నకు ప్రేమతో’ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.మరో వైపు దర్శకుడు కొరటాల శివ ‘శ్రీమంతుడు’ చిత్రం తర్వాత ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే.
దాంతో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.ఆ నేపథ్యంలో ఈ చిత్రం గురించిన చిన్న వార్త అయినా కూడా దావాణంలా వ్యాప్తి చెందుతుంది.
అదే విధంగా ఎన్టీఆర్ యాక్సిడెంట్ అనే పుకారు కూడా తెగ హడావుడిని సృష్టించింది.