తెలంగాణ నాయకులు రోజూ అదే పనిగా వల్లించే ‘బంగారు తెలంగాణ’ గత వారం రోజులుగా ‘కంపు తెలంగాణ’గా మారింది.మున్సిపల్ కార్మికుల (పారిశుద్ధ్య కార్మికులు) సమ్మె ఆదివారంతో ఏడో రోజుకు చేరుకున్నా ఇప్పటివరకు ప్రభుత్వం పరిష్కార మార్గం వెతకలేదు.
ప్రధానంగా అధికార పార్టీ వారు విశ్వనగరంగా కీర్తిస్తున్న రాజధాని హైదరాబాదు నగరం చెత్తకుప్పలతో దుర్గంధం వెదజల్లుతోంది.ఈమధ్య హైదరాబాద్ మీద రాసిన ఒక పాటలో (యూట్యూబ్లో విపరీతంగా చూస్తున్నారు) ఆకాశం నుంచి ఊడిపడిన స్వర్గం హైదరాబాద్ అని పాడారు.
గత వారం రోజులుగా ఈ నగరం పాతాళం నుంచి పైకొచ్చిన నరకం మాదిరిగా ఉంది.వేల టన్నుల చెత్త నగరంలో పేరుకుపోయింది.
ఆ చెత్తకుప్పల మీది నుంచి వచ్చే గాలులు భయంకరమైన జబ్బులు తెప్పించడం ఖాయంగా కనబడుతోంది.సమ్మె మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు భారీ వానలు పడలేదు.
అడపాదడపా చిరు జల్లులు పడ్డాయి అంతే…! అదే భారీ వానలు కురిసినట్లయితే జనం చెత్తాచెదారంలో, మురుగునీటిలో ఈత కొట్టుకుంటూ తిరగాల్సివచ్చేది.జంట నగరాల్లో ప్రతి రోజూ నాలుగు వేల టన్నుల చెత్త పోగవుతుందని అంచనా.
వారం రోజులుగా చెత్త కుప్పలు పడివుండటంతో ఎన్ని వేల టన్నుల చెత్త పోగయిందో అంచనాకు అందడంలేదు.జిహెచ్ఎంసీ ప్రయివేటుగా కార్మికులను పనిలోకి తీసుకుంటున్నా సమ్మెలో ఉన్న కార్మికులు వారిని రానీయకుండా అడ్డుకుంటున్నారు.
ప్రభుత్వంతో కార్మికుల చర్చలు విఫలం కావడంతో సమ్మె ఇంకా ఉధృతం చేస్తామంటున్నారు.సర్కారు ముందుగా పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు, డిమాండ్లు పరిష్కరించిన తరువాత, భవిష్యత్తులోనూ వారు దీర్ఘకాలం సమ్మె చేసే పరిస్థితి రాకుండా చూసిన తరువాత హైదరాబాదును విశ్వనగరం చేయడం గురించి ఆలోచించవచ్చు.
రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా ఎలా మార్చాలో సోంచాయిచవచ్చు.ముందైతే సమస్యలు పరిష్కరించాలనే సోయి ఉండాలె.