కరోనా వైరస్ కారణంగా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా లాక్ డౌన్ విధించడంతో తమ ఇళ్లకు చేరుకోలేక పోయిన ఎంతో మంది నిస్సహాయులను తన సొంత డబ్బు వెచ్చించి తమ స్వగ్రామాలకు చేర్చి నటువంటి టాలీవుడ్ ప్రముఖ విలన్ సోను సూద్ అనుకోకుండా ఓ వివాదంలో చిక్కుకున్నాడు.దీంతో ఇటీవలే ముంబై కార్పొరేషన్ సంస్థ అధికారులు సోనుసూద్ పై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు కూడా చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే ఇటీవలే సోనుసూద్ ముంబై లోని జూహూ పరిసర ప్రాంతంలో ఉన్న తన భవనాన్ని హోటల్ గా మార్చి కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న సమయంలో వైద్య సిబ్బందికి మరియు పారిశుద్ధ్య కార్మికులకు అలాగే ఇతర ప్రభుత్వ అధికారులకు ఉచితంగా బస చేయడంతో పాటు భోజన వసతులను కూడా కల్పించాడు.అయితే తాజాగా ముంబై కార్పొరేషన్ అధికారులు సోను సూద్ ప్రైవేట్ గా ఉన్నటువంటి తన భవనాన్ని ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా హోటల్ గా మార్చాడని అందుకు తమ వద్ద సాక్ష్యాలున్నాయని తెలిపారు.
అయితే సోనూ సూద్ మాత్రం ఈ విషయం గురించి తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ తాను ముందుగా ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకున్న తరువాతే తన భవనాన్ని హోటల్ గా మార్చామని స్పష్టం చేశాడు. అంతేగాక ప్రస్తుతం మహారాష్ట్ర కోస్టల్ అథారిటీ మేనేజ్ మెంట్ అథారిటీ అనుమతులు తప్ప మిగిలిన అన్ని సంస్థల అనుమతులను తీసుకున్నామని తెలిపాడు.కాగా మహారాష్ట్ర కోస్టల్ మేనేజ్మెంట్ అథారిటీ అనుమతులను తీసుకునే లోపే లాక్ డౌన్ విధించారని అనుమతుల కోసం లేటు అయిందని కూడా వివరణ ఇచ్చాడు.మరి ఈ విషయంపై పోలీసులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.
ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది. అంతేకాక కొంత మంది నెటిజన్లు ఈ విషయం గురించి స్పందిస్తూ దేశంలో కోట్ల రూపాయలు స్కాములకు పాల్పడి ఇతర దేశాలకు వెళ్లి దాక్కున్న వారిని పట్టుకోకుండా లాక్ డౌన్ సమయంలో మంచి పనులు చేసినటువంటి సోనూసూద్ ని టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించడం సరికాదని అంటున్నారు.
ప్రస్తుతం సోనూసూద్ తెలుగులో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య అనే చిత్రంలో నటిస్తున్నాడు.