దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఘటన నిందితులు వారికి పడిన శిక్షలను తప్పించుకొనేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే నిర్భయ ఘటనలో నిందితులు అయిన వినయ్ శర్మ(26) అక్షయ్ కుమార్ సింగ్(31),ముకేష్ కుమార్ సింగ్(32),పవన్ గుప్తా(25) లకు ఫిబ్రవరి 1 న ఉరిశిక్షలు అమలు చేయాలి అంటూ ఢిల్లీ పటియాలా కోర్టు తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే.
అయితే వారికి శిక్షలు అమలు పరచడం కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతుండగా ఇప్పుడు తాజాగా వారు కోర్టు కెక్కినట్లు తెలుస్తుంది.డెత్ వారెంట్ దగ్గరకి వస్తుండడం తో నిందితుల్లో ఇద్దరు పవన్,అక్షయ్ తరపున న్యాయవాది ఏపీ సింగ్ ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు లో ఒక పిటీషన్ దాఖలు చేశారు.
దోషులు క్యురేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు వేసేందుకు అవసరమైన పత్రాలను ఇవ్వడంలో తీహార్ జైలు అధికారులు ఆలస్యం చేశారని, అందువల్లే ఆ ఇద్దరు దోషులు క్షమాభిక్ష పిటిషన్ వేసుకునేందుకు ఆలస్యమైందని న్యాయవాది ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.
దీనికి సంబంధించిన పిటిషన్ విచారణను ఢిల్లీ కోర్టు రేపు చేపట్టనున్నట్లు తెలుస్తుంది.డెత్ వారెంట్ జారీ అయిన తర్వాత వీళ్లిద్దరూ ఇప్పటి వరకు క్యురేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేయలేదు.గతంలో పవన్ క్షమాభిక్ష పిటిషన్ వేసినట్లు వార్తలు వచ్చినప్పటికీ అవి అసత్యం అని పవన్ తరపు న్యాయవాది పేర్కొన్నారు.