ఏపీ సీఎం జగన్ కు ఇప్పుడు నలువైపుల నుంచి ముప్పేట దాడి ఎక్కువవుతోంది.ఏపీ అభివృద్ధి విషయంలో జగన్ ఎంత చిత్తశుద్ధి చూపిస్తున్నా ఇసుక కొరత జగన్ ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు తీసుకొస్తోంది.
ప్రధాన ప్రత్యర్థులంతా ఇప్పుడు ఏకమై ఇసుక విషయంలో ప్రభుత్వ తీరుని తప్పుపడుతుండడమే కాకుండా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేస్తుండడం ప్రభుత్వానికి చికాకు తెప్పిస్తుంది.దీనినుంచి బయటపడేందుకు జగన్ ప్రభుత్వం ఇసుక వారోత్సవాలు చేయాలని చూస్తోంది.
నిన్ననే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇసుక విషయంలో ప్రభుత్వ తీరుని తప్పుపడుతూ విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించాడు.తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా కూడా దీనిపై ఆందోళన తీవ్రతరం చేసాడు.
ఇది ఇలా ఉండగానే ఇప్పుడు ఇసుక విధానం గురించి జగన్ ను ప్రశ్నిస్తూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాయడం సంచలనం రేపుతోంది.
ఇసుక ప్రజలకు ప్రకృతి ఇచ్చిన వరం.దానికి ప్రభుత్వం అడ్డం పడరాదు.ఇసుక అందించలేనపుడు రాష్ట్రం దాటకుండా నిఘా పెట్టి రాష్ట్రం లోపల ప్రజలు ఎక్కడ దొరికితే అక్కడ ఇసుకను ఉచితంగా తీసుకునేలా వెంటనే ఆదేశాలు ఇవ్వండి.
ప్రజలు సుఖంగా బతికేలా పాలన ఉండాలి.ఇసుక కొరత లాంటి కారణాలు ప్రజల ఆత్మహత్యలకు దారితీయడం దారుణం.సమాజంలో మేధావి నుండి సామాన్యుడి వరకూ ఇసుక పాలసీపై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు.పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి భూములు అమ్మబోతున్నారన్న వార్తలు వింటున్నాం.
ఎన్నికల సమయంలో చెప్పని ఎన్నో పథకాలు కొత్తగా పెట్టాలని చూస్తున్నారు.వాటి అమలుకు తేదీలు ప్రకటిస్తున్నారు.
కానీ అందులో మా కాపుల రిజర్యేషన్ అంశం లేకపోవడం మా కాపులు చేసుకున్న పాపంగా భావిస్తున్నాం.
మీరు పరిపాలన చేస్తున్న తీరు మీరు తీవ్ర అభద్రతా భావంలో ఉన్నారని తెలియజేస్తోంది’ అని జగన్కు రాసిన లేఖలో ముద్రగడ పేర్కొన్నారు.అయితే ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న ముద్రగడ ఇప్పుడు విపక్షాలన్నీ ఏకమై ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న సమయంలో ఇసుక కొరత, కాపు రిజర్వేషన్ అంశంపై లేఖ రాయడంపై వైసీపీ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది.వైసీపీని రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల్లో ఎవరో ఒకరు ముద్రగడను ఉసిగొల్పినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
అయితే ఇప్పటివరకు ముద్రగడ లేఖకు సంబంధించి వైసీపీ తరపున ఎవరూ తమ స్పందన అయితే తెలియజేయలేదు.
.