కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్న ఘటన పై వివిధ రాజకీయ పార్టీలు పార్టీల నాయకులు రక రకాలుగా స్పందిస్తున్నారు.ఇదంతా డ్రామా అంటూ వైసీపీ మంత్రులు కొట్టిపారేస్తూ ఉండగా, టిడిపి బిజెపి జనసేన పార్టీ లు చంద్రబాబు కు మద్దతుగా వైసీపీ పై విమర్శలు చేస్తున్నాయి ఇదే అంశంపై సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి.
చంద్రబాబుకు అన్ని వైపుల నుంచి సానుభూతి వ్యక్తం అవుతోంది.ఇదిలా ఉండగా తాజాగా కాపు ఉద్యమ నాయకుడిగా ఏపీలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం టిడిపి అధినేత చంద్రబాబు కు లేఖ రాశారు.
ఈ లేఖలో చంద్రబాబు పై ఘాటు విమర్శలు చేశారు.
జరిగిన అవమానం గురించి చంద్రబాబు వెక్కివెక్కి ఏడవడం టీవీలో చూసి ఆశ్చర్యపోయాను.
నాడు మా కుటుంబానికి చేసిన అవమానానికి ఆత్మహత్య చేసుకోవాల్సింది.మీ పతనం నా కళ్ళతో చూడాలని ఆత్మహత్య చేసుకోవడం విరమించుకున్నాను.
కాపులకు చంద్రబాబు ఇచ్చిన హామీ కోసం దీక్ష ప్రారంభిస్తే అవమానించారు.ఇంటి తలుపులు బద్దలు కొట్టి కుటుంబ సభ్యులను బూతులు తిడుతూ తీసుకెళ్లడం చంద్రబాబు గుర్తులేదా అంటూ లేఖలో ముద్రగడ పేర్కొన్నారు.
చంద్రబాబు పుత్రరత్నం పోలీసులకు ఫోన్ చేసి మమ్మల్ని అవమానించమన్నారు.
రాజమండ్రి ఆస్పత్రిలో మమ్మల్ని 14 రోజులు నిర్బంధించి రాక్షసానందం పొందాడు.శపధాలు ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, మమతా బెనర్జీ లాంటి వారికే సొంతం.చంద్రబాబు చేసిన ముఖ్యమంత్రి శపథం నీటిమీద రాత అని గ్రహించాలి.
జీవితాలు, ఆస్తులు, పదవులు, ఎవరికీ శాశ్వతం కాదు అంటూ లేఖలో పేర్కొన్నారు.మీరు చేసిన హింసా తాలూకా అవమానాన్ని తట్టుకోలేక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను.
అణిచివేత తో మా కుటుంబం ఆత్మహత్యకు పూనుకోవాలి అన్నది మీ ప్రయత్నం కాదా ? నా కుటుంబాన్ని ఎంతగా అవమానించిన మీ నోటి వెంట ఇప్పుడు ముత్యాల్లాంటి వేదాలు వస్తున్నాయి.మీ బంధువులు మీ మీడియా ద్వారా సానుభూతి పొందే అవకాశం మీకే వచ్చింది ”’ అంటూ ఘాటు లేఖ రాశారు.