తల్లిదండ్రులు పిల్లలకోసం రేయింబవళ్లు కష్టపడి చదివిస్తారు.తాము కన్న కలలను పిల్లలు సాకారం చేస్తారని ఎంతో శ్రమిస్తారు.
తాము కడుపునిండా తిండి తిన్నా తినకపోయినా తమ పిల్లలకు మాత్రం ఏ లోటు రాకుండా చూసుకుంటారు.అలా కలలు కన్న ఒక రైతు కలలను ఆ రైతు ఐదుగురు పిల్లలు సాకారం చేశారు.
ఐదుగురు పిల్లలలో ఒకరు అమెరికాలో స్థిరపడగా మిగతా నలుగురు పిల్లలు మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.
పూర్తి వివరాలలోకి వెళితే ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెద్ద మండవ గ్రామంలో పొలం సాగు చేసుకొని జీవించే లక్ష్మి, మంగిరెడ్డి దంపతులకు ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.
నలుగురు కుమార్తెలలో పెద్ద కుమార్తె నాగమణి ప్రభుత్వ ఉద్యోగం సాధించగా రెండో కుమార్తె జానకి టీఎస్పీఎస్సీ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో హెల్త్ ఇన్స్పెక్టర్ ఫలితాల్లో రెండో ర్యాంకు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఫలితాల్లో ఎనిమిదో ర్యాంకు సాధించింది.
మూడో కూతురు అమెరికాలో ఉన్నతోద్యోగంలో స్థిరపడగా మిగిలిన పిల్లలిద్దరూ బ్యాంకు ఉద్యోగాలను సాధించారు.
కష్టంతో తాము తమ పిల్లలను చదివించామని తమ పిల్లలు ఎంతో కష్టపడి తమ కలలను నిజం చేశారని తల్లిదండ్రులు చెబుతున్నారు.తాము ఉద్యోగాలు సాధించడంలో తమ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందని వారి ప్రోత్సాహం వలనే తాము అనుకున్న లక్ష్యాలను సాధించామని పిల్లలు చెబుతూ ఉండటం గమనార్హం.