పుష్కరాల్లో మృత్యు ఘోషకు ‘అతి ముఖ్యమైన వ్యక్తులు’ (వీవీఐపీ) కారణమని తెలుస్తోంది.ఆంధ్రాలోని రాజమండ్రిలో పుష్కరాల ప్రారంభం రోజే జరిగిన తొక్కిసలాటలో పదకొండు మంది చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం అందగా, తాజా సమాచారం ప్రకారం ఆ సంఖ్య ఇరవైఐదుకు పెరిగింది.
గాయపడిన అనేకమందిని ఆస్పత్రిలో చేర్చారు.వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
అంటే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.పుణ్య స్నానాలు చేయడానికి వచ్చిన వారిలో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి కారకులైన ‘పాపాత్ములు’ వీవీఐపీలే.
ఈ జాబితాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు.అసలేం జరిగిందంటే….
పుష్కరాలు ప్రారంభమయ్యే ముహూర్తంలో స్నానం చేసేందుకు వేలాది మంది గోదావరి ఘాట్లకు చేరుకున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులు, ఇంకా అనేకమంది ప్రముఖులు వచ్చారు.
మరి వీరంతా వీవీఐపీలు కదా….! వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి కదా….! దీంతో కొన్ని గంటలపాటు అక్కడి అధికారులు, సిబ్బంది జనాన్ని ఆపేశారు.గంటలపాటు నిరీక్షించిన జనానికి సహజంగానే సహనం నశిస్తుంది కదా…! దీంతో వీవీఐపీలంతా పుణ్యం సంపాదించుకొని వెళ్లగానే జనం ఒక్కసారిగా ఒకరిని ఒకరు తోసుకుంటూ పరుగు తీశారు.
ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది.రెండు గంటలకు పైగా జనం క్యూలో నిలుచుని ఉన్నారని సమాచారం.వీవీఐపీలు వెళ్లిపోయాక జనాన్ని కంట్రోలు చేయడం పోలీసుల వల్ల కాలేదు.కొందరు వీవీఐపీలు గంటల పాటు ఘాట్ల వద్ద కార్యక్ర మాలు చేసుకుంటూ కూర్చున్నారట….! ఒక దశలో లాఠీఛార్జి కూడా జరిగిందని తెలుస్తోంది.ఈ దుర్ఘటనపై పోలీసులు వేరే ‘కతలు’ వినిపిస్తున్నారు.వీవీఐపీలు జనంతో కలిసి స్నానం చేస్తే నష్టమా? వారి హోదాకు భంగం కలుగుతుందా? ప్రజాస్వామ్యంలోనూ ఈ ఫ్యూడల్ కల్చర్ వదలకుండా జిడ్డులా పట్టుకుంది.