నాయకులపై అభిమానం ఉండవచ్చు కానీ ఆ అభిమానాన్ని బయటకు వెల్లడించేందుకు సమయం సందర్భం ఉంటుంది.అలా కాకుండా ఎక్కడ బడితే అక్కడ స్వామి భక్తిని ప్రదర్శిస్తే నవ్వులపాలు అవ్వడమే కాకుండా ఆ తరువాత చిక్కుల్లో పడాల్సి వస్తుంది.
ఆ విధంగానే శ్రీకాకుళం జిల్లాకు చెందిన తహిసీల్ధార్ ఒకరు జగన్ పాటకు ఉత్సాహంతో గంతులు వేయడం అదికాస్తా సోషల్ మీడియాకు ఎక్కడంతో ఇప్పుడు అది వైరల్ న్యూస్ గా మారింది.
ఎన్నికల ప్రచారాన్ని పురస్కరించుకుని వైసీపీ ఎన్నికల సమయంలోఉపయోగించిన ‘రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న’ అనే పాటకు తహసీల్దార్ స్టెప్పులు వేసి అక్కడ నవ్వులు పూయించారు.
ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా భామినిలో జరిగింది.వైసీపీ పాటకు తహసీల్దార్ డ్యాన్స్ వేయడం ఆ వీడియో ఎవరో సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో ఇది వెలుగులోకి వచ్చింది.
కార్తీకమాసం సందర్భంగా భామినిలోని నేరడి బ్యారేజ్ వద్ద వైసీపీ కార్యకర్తలు వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు.ఈ కార్యక్రమానికి భామిని తహసీల్దార్ ఎస్.నర్సింహమూర్తి, ఇతర రెవెన్యూ సిబ్బంది ముఖ్య అథిధులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వైసీపీ ప్రచార పాటలు పెట్టారు.
దీంతో అప్పటివరకు హుందాగా సైలెంట్ గా ఉన్న తహసీల్దార్ ఒక్కసారిగా పూనకం వచ్చినట్టు ఊగిపోతూ అక్కడ వైసీపీ కార్యకర్తలతో కలిసి డాన్స్ చేశారు.అయితే ప్రభుత్వ ఉద్యోగి అయ్యి ఉండి ఇలా పార్టీ పాటలకు డాన్సులు చేయడంపై చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.