జగన్కు అత్యంత సన్నిహితుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడి గా గుర్తింపు పొందిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖలో ఇప్పుడు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జనంలో పలుకుబడి పెంచుకునేందుకు , ప్రజా సమస్యలను తీర్చేందుకు ‘ సాయన్న ప్రజా దర్బార్ పేరుతో జనాలకు అందుబాటులో ఉండే విధంగా సాయన్న ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ప్రతిరోజు ఈ ప్రజాదర్బార్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నారు.
స్వయంగా తానే ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని, ఇందులో ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని వారికి అక్కడికక్కడే పరిష్కారం చూపించాలని ,తాను అందుబాటులో లేని సమయంలో తన కార్యాలయ సిబ్బంది ఈ సమస్యలను పరిష్కరిస్తారని, అలాగే ప్రజా సమస్యలకు సంబంధించి ట్రాకింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తామని , దీని ద్వారా తమ ఫిర్యాదుల స్టేటస్ ఏ విధంగా ఉందో తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని విజయసాయిరెడ్డి ప్రకటించారు.
కొద్దిరోజుల క్రితమే ఏపీ సీఎం జగన్ వైసీపీ ప్రజా పతినిధులు అందరికీ కీలక సూచనలు చేశారు.
ఎంపీలు ఎమ్మెల్యేలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని , వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.ఏపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున కోట్ల రూపాయల ఖర్చుతో అమలు చేస్తోందని, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వాటిని పగడ్బందీగా అమలు అయ్యేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.
దీనిలో భాగంగానే విజయసాయిరెడ్డి విశాఖలో ఇప్పుడు సాయన్న ప్రజాదర్బార్ పేరుతో జనాల్లోకి వెళ్లారు.
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, దీనికితోడు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వంటి కారణాలతో మొదట్లో ఉన్నంత సానుకూలత ఇప్పుడు కనిపించకపోవడంతో జగన్ సైతం ఆందోళన లోనే ఉన్నారు.వేల కోట్లు కుమ్మరించి ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న, ప్రతిపక్షాలు పార్టీపై విమర్శలు చేస్తూ జనాల్లో ప్రభుత్వానికి క్రెడిట్ రాకుండా చేస్తుండడం గుర్తించిన జగన్ ప్రతిపక్షాలకు ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశం ఇవ్వకుండా, ముందుగానే ప్రజాసమస్యలను పరిష్కరించే విధంగా ఎమ్మెల్యే, ఎంపీలకు ఈ విధంగా సూచనలు చేసినట్లు గా కనిపిస్తున్నారు.