మొన్నటివరకు బీరాలు పోయిన ఎంపీ గారు ఇప్పుడు మాత్రం ఏమీ మాట్లాడకుండా మిన్నకుండిపోయారు.మూడు రాజధానుల విషయంలో వైసీపీ పార్టీ తీసుకున్న నిర్ణయం విషయం లో కేంద్రం సరైన సమయంలో జోక్యం చేసుకుంటుంది అన్న బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఇప్పుడు మాత్రం నోరు మెదపడం లేదు.
కారణం ఏపీ మూడు రాజధానుల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని కేంద్రం కొద్దిరోజుల క్రితమే ప్రకటించడమే దీనికి ప్రధాన కారణం.పార్లమెంట్లోనే ఈ విషయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడం తో ఏపీలోని అధికార పార్టీకి ఈ విషయంలో కేంద్రం నుంచి దాదాపుగా లైన్ క్లియర్ అయినట్లు అర్ధం అవుతుంది.
అధికార పార్టీ మూడు రాజధానులు అంటూ ప్రకటించిన వెంటనే అమరావతిని అంగుళం కూడా కదల్చలేరని పదే పదే సవాల్ చేశారు.ఈ విషయంలో సరైన సమయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని… అన్ని విషయాలు కేంద్ర పెద్దల దృష్టికి తాను తీసుకెళుతున్నానని ఆయన చెబుతూ వచ్చారు.
అయితే రాజధానుల ఏర్పాటు అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని కేంద్రం ప్రకటించనప్పటి నుంచి సుజనా చౌదరి పూర్తిగా సైలెంట్ అయిపోయారు.
లేదంటే వారానికొక సారైనా మీడియా ముందుకు వచ్చి రాజధాని మార్పు సాధ్యంకాదని చెప్పుకుంటూ వచ్చిన సుజనా చౌదరి ఇప్పుడు మాత్రం దీనిపై మాట్లాడటం లేదు.
మొత్తానికి ఏపీ రాజధాని రగడపై కేంద్రం చేసిన ప్రకటన ఆ పార్టీ ఎంపీ నోటికి తాళం వేసిందనే ప్రచారం మాత్రం జోరుగా కొనసాగుతుంది.మరి ప్రచారం పై ఎంపీ గారు ఎలా స్పందిస్తారో చూడాలి.