ఏపీ అధికార పార్టీ వైసీపీలో పార్టీ నేతల మధ్య అంతర్గత కలహాలు వీధికెక్కుతున్నాయి.ఎక్కడికక్కడ గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడంతో పెద్ద తలనొప్పిగా మారాయి.
ప్రతి నియోజకవర్గంలోనూ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, ఆధిపత్యపోరు ఇలా ఎన్నో సమస్యలతో పార్టీ ఇబ్బంది పడుతోంది.ఈ తరహ వివాదాలు, విభేదాలు ఈ మధ్యకాలంలో మరీ పెరిగిపోతుండడంతో జగన్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.
పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎప్పటికే ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని విజయసాయిరెడ్డికి, కోస్తా ఆంధ్ర వైవి సుబ్బారెడ్డి, రాయలసీమ ప్రాంతాన్ని సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పజెప్పి పార్టీ వ్యవహారాలు పూర్తిగా వారి కంట్రోల్ లో ఉంచుకోవాలని, ఎక్కడా, ఎటువంటి వివాదాలు లేకుండా చేయాలని జగన్ బాధ్యతలు అప్పగించారు.
ఈమేరకు వారు రంగం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ వస్తున్నారు.
అయినా నాయకుల మధ్య విభేదాలు ఆగడం లేదు.వీధికి ఎక్కి మరీ తన్నుకునే పరిస్థితి ఏర్పడింది.
ఒకపక్క ప్రభుత్వ వ్యవహారాల్లో క్షణం తీరిక లేకుండా జగన్ ఉంటే పార్టీలోని నాయకులు మధ్య వర్గ విభేదాలు జగన్ కు పెద్ద తలనొప్పిగా మారాయి.కొద్ది రోజుల క్రితం రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా, కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ, ఆ పార్టీ నాయకులు గట్టు రామచంద్ర రావు, మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది.
అలాగే చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మధ్య బహిరంగంగానే సవాళ్లు ప్రతిసవాళ్లలతో వాతావరణం వేడెక్కింది.ఇదే కాదు.ఎక్కడికక్కడ ఇదే తరహా గ్రూపు రాజకీయాలు పెరిగిపోతుండటంతో రాజకీయ ప్రత్యర్ధులకు ఇది అనుకూలంగా మారింది.ఈ నేపథ్యంలో పార్టీ బాధ్యతలు , ప్రభుత్వ వ్యవహారాలు తానొక్కడినే చూసుకోవడం కష్టమనే అభిప్రాయంతో జగన్ పార్టీ అధ్యక్షుడిగా వేరొకరిని నియమించాలని డిసైడ్ అయ్యాడట.
ఈ మేరకు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ని అధ్యక్షుడిగా నియమిస్తే, అన్ని వ్యవహారాలు సమర్థవంతంగా చక్కబెట్టగలరని జగన్ నమ్ముతున్నారు.
ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో వైసీపీ తరఫున మిధున్ రెడ్డి అన్ని వ్యవహారాలూ చక్కబెడుతున్నారు.
ఆయన ఎప్పటికప్పుడు తన సత్తా నిరూపించుకుంటూ వస్తున్నారు.అంతేకాకుండా తనకు అత్యంత సన్నిహితుడుగానూ ఉండడంతో, ఆయన అయితేనే పార్టీని తాను అనుకున్న విధంగా ముందుకు తీసుకెళ్లగలరని , గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టగలరని జగన్ నమ్ముతున్నారు.
మరికొద్ది రోజుల్లోనే మిధున్ రెడ్డికి వైసిపి పగ్గాలు అందే అవకాశం కనిపిస్తోంది.