ప్రపంచం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా కొందరు నేటికీ మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్నారు.ఆ మూఢ నమ్మకాల వల్ల ఇతరుల ప్రాణాలను బలి చేస్తున్నారు.
దేవత, దేవుళ్లు కరుణిస్తారనే నమ్మకంతో నరబలి పేరుతో అమాయకుల ప్రాణాలను బలి చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లో ఎంత అవగాహన కల్పిస్తున్నా నేటికీ కొందరి ఆలోచనా తీరులో ఏ మాత్రం మార్పు రావడం లేదు.
తాజాగా ఒక వ్యక్తి దేవుడు కరుణించాలనే ఆలోచనతో సొంత భార్యనే నరబలి ఇచ్చాడు.భార్య చనిపోయిన తరువాత ఆమె మృతదేహాన్ని దేవుని గదిలోనే పాతిపెట్టాడు.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలీ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన కంప్యూటర్ కాలంలోనూ మనుషులు ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారో తెలుపుతోంది.సింగ్రౌలీ జిల్లాలోని బసౌదా గ్రామంలో 50 సంవత్సరాల వ్యక్తి 45 సంవత్సరాల భార్యను కడతేర్చాడు.
భార్య తల, మొండెం వేరు చేసి పూజగదిలో పాతిపెట్టాడు.
దేవత కరుణించాలంటే నరబలి ఇవ్వాలని సదరు వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
అతని కొడుకుకు తల్లిని పూజగదిలో తండ్రి పూడ్చాడని తెలిసి తీవ్ర భయాందోళనకు గురై వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏఎస్పీ ప్రదీప్ షిండే మూడ నమ్మకాలే ఈ ఘటనకు కారణమయ్యాయని తెలిపారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని వెలికితీసి ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి గతంలో ఒక మేకను కూడా ఇదే విధంగా బలి ఇచ్చి పూడ్చిపెట్టాడని తెలుస్తోంది.