టిఆర్ఎస్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయినా ఈటెల రాజేందర్ ఏ క్షణమైనా పార్టీకి రాజీనామా చేసే అవకాశం కనిపిస్తోంది.అలాగే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఉప ఎన్నికల్లో గెలవాలని, గెలిచి తన పట్టు నిలుపుకోవాలని రాజేందర్ చూస్తున్నారు.
అయితే ఆయన సొంత పార్టీ పెట్టబోతున్నారనే హడావుడి ఒక వైపు నడుస్తుండగా, ఆయన టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బలమైన పార్టీలో చేరబోతున్నారు అంటూ మరో ప్రచారం జరుగుతోంది.ఇవన్నీ ఇలా ఉండగా టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పూర్తిగా రాజేందర్ ను ఇరుకున పెట్టే విధంగా ప్రయత్నిస్తోంది.
ఆయనకు సంబంధించిన అన్ని ఆర్థిక వ్యవహారాలపై దృష్టి పెట్టడమే కాకుండా, భూకబ్జా ఆరోపణలు రావడం, దీనిపై సమగ్ర విచారణకు కెసిఆర్ ఆదేశాలు ఇవ్వడం వంటి వ్యవహారాలు చోటుచేసుకున్నాయి.
ఇదిలా ఉంటే రాజేందర్ ను బిజెపిలోకి తీసుకువచ్చేందుకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.రాజేందర్ ధర్మపురి అరవింద్ తో భేటీ అయ్యారు.ఈ భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
బిజెపి లోకి వస్తే మంచి ప్రాధాన్యత ఇస్తామని, కేంద్ర బిజెపి పెద్దలు సైతం ఈ విషయంలో సానుకూలంగా ఉన్నారనే విషయాన్ని అరవింద్ రాజేందర్ కు చెప్పినట్లు తెలుస్తోంది.అంతేకాకుండా అధిష్టానం పెద్దలతో ఈ విషయమై అరవింద్ మాట్లాడినట్లు సమాచారం.
ఏదో రకంగా రాజేందర్ ఉద్యమ నేపథ్యం ఉన్న బలమైన నాయకుడని, బీజేపీ తలుచుకుంటే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని చూస్తున్న బిజెపికి కలిసివస్తుందనే లెక్కలను అధిష్టానం వద్ద అరవింద్ వివరించినట్లు సమాచారం.అది కాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వ వేధింపులు తగ్గుతాయి అని బీజేపీ లోకి రావాల్సిందిగా రాజేందర్ పై ఒత్తిడి పెంచుతున్నట్లు సంచారం.
అయితే రాజేందర్ మాత్రం కొంతకాలం గ్యాప్ తీసుకుని తన రాజకీయ నిర్ణయాన్ని వెల్లడించాలని చూస్తున్నారట.సొంత పార్టీ పెడితే కలిసి వచ్చే ప్రయోజనాలు ,ఇబ్బందులను లెక్కలు వేసుకొని ఆయన బిజెపి పార్టీలోకి వెళ్తే కలిగే ప్రయోజనాలు ఇబ్బందులు వంటివి లెక్కలు వేసుకుని పనిలో ఉన్నారట.