ప్రేమా, అభిమానం, గౌరవం, ఎప్పుడు బడితే అప్పుడు వ్యక్తమయ్యేవి కావు సందర్భాన్ని బట్టి వాటికవే బయటపడుతాయి.మనిషి కష్టకాలంలో ఉన్నప్పుడు మాత్రమే అర్థమవుతుంది చుట్టూ ఉన్న వాళ్ళు తనవాళ్ళ కాదా అని.
ప్రస్తుతం మన భారత దేశం కష్ట కాలంలో ఉంది.కరోనా మహమ్మారి మన దేశంలో విలయతాండం చేస్తోంది.
కేంద్ర వైఫల్యం అంటూ బురదలు జల్లుకుంటున్నారు తప్ప గట్టెక్కే మార్గం కాని, తమకు తోచిన సాయం చేస్తున్నవారు కొద్ది మంది మాత్రమే కనపడుతున్నారు.ప్రభుత్వ వైఫల్యమా, ప్రజల నిర్లక్షమా అనేది ఇప్పుడు అప్రస్తుతం భారత్ కరోనా కోరల్లోంచి బయటపడాలి, ఇదే భారతీయుడిగా ప్రతీ ఒక్కరూ కోరుకునేది.
ప్రస్తుతం భారత్ పరిస్థితి దయనీయంగా మారింది ఈ పరిస్థితిని చూస్తున్న విదేశాలలోని ప్రవాస భారతీయులు సరైన సమయంలో భారత్ కు వెన్ను దన్నుగా నిలుస్తున్నారు.
ఎన్నారైలు అంటే చాలా మందికి చులకన భావం ఉంటుంది.
దేశం విడిచి వెళ్ళిపోయి పరాయి దేశంలో సేవ చేస్తున్నారు.భారత్ పై ప్రేమే లేదు అంటూ ఎన్నారైలను వేలెత్తి చూపే వాళ్ళు లేకపోలేదు.
అలాంటి వారికి ఇప్పుడు సరైన సమాధానం దొరికిందనే చెప్పాలి.కరోనాతో భారత్ విలవిలాడుతుంటే చూసి తట్టుకోలేని ప్రవాస భారతీయులు ఆయా దేశాల్లోని ప్రభుత్వాలని భారత్ కు సాయం చేయాలంటూ వేడుకుంటున్నారు.
అగ్ర రాజ్యం అమెరికాలో రాజకీయాల్లో సైతం కీలక వ్యక్తులుగా ఉన్న వాళ్ళు తమ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బిడెన్ తో భారత్ కు సాయం అందిస్తామనే ప్రకటన చేయించారు.
అంతేకాదు యూకే , కెనడా లలో ఉన్న ప్రవాస భారతీయులు కూడా ఇదే తరహా ప్రయత్నాలు చేస్తున్నారు.
కెనడా, యూకే లలో ఉన్న ప్రవాస పంజాబీలు భారత్ కు మద్దతు ఇవ్వాలంటూ భారీ ర్యాలీ చేపట్టారు.ప్రస్తుతం భారత్ కు మీరు సాయం చేయాలని ఆయా దేశాలలో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు.
మా మాతృ దేశానికి మీ సాయం ఎంతో అవసరం ఆదుకోండి అంటూ నినాదాలు చేస్తున్నారు.అంతేకాదు వివిధ దేశాలలో ఉంటున్న ఎంతో మంది ప్రవాస భారతీయులు భారత్ కు తమ వంతు సాయంగా పలు రకాల వైద్య పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్స్ అందిస్తున్నారు.
కష్ట కాలంలో, సరైన సమయంలో భారత ఎన్నారైలు భారత ప్రజల కోసం ముందుకు రావడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.భారత్ పై వారు చూపిస్తున్న ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి.
విదేశాలలో స్థిరపడినా తాము పుట్టిన భూమి కోసం ఇక్కడి ప్రజల కోసం సాయమందిస్తున్న ప్రతీ ఒక్క ప్రవాస భారతీయుడుకు కృతజ్ఞతలు చెప్పాల్సిందే.