అమ్మ అనే పదం కన్నా గొప్పది ఈ ప్రపంచంలో ఏదీ లేదంటారు.నవమాసాలు మోసి కనే అమ్మ, బిడ్డ ఆకలికి తల్లడిల్లిపోతుందని మనకు తెలుసు.
నిస్సహాయ స్థితిలో ఉన్నా కూడా తన పిల్లల ఆకలి తీర్చిన ఓ మాతృమూర్తికి నెటిజన్లు జోహార్లు కొడుతున్న ఘటన తమిళనాట చోటు చేసుకుంది.ఇంతకీ ఆ నిరుపేద తల్లి ఏం చేసిందో తెలుసుకుందామా!
తమిళనాడులో సేలంకు చెందిన సెల్వం, ప్రేమ ప్రేమించుకుని పెళ్లాడారు.
వారికి ముగ్గురు పిల్లలు.ఇటుక బట్టీలో పనిచేస్తూ సేల్వం, ప్రేమ తమ కుటుంబాన్ని పోషించేవారు.
కాగా సొంతంగా వ్యాపారం చేద్దామనుకున్న సేల్వం దొరికిన చోటల్లా అప్పు చేసి వ్యాపారం మొదలుపెట్టాడు.కానీ అందులో నష్టాలు రావడంతో మొత్తం అప్పు రూ.2.5 లక్షలుగా మిగిలింది.దీంతో అతడు తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.అసలే భర్త చనిపోయిన ప్రేమను అప్పులవాళ్లు వేధించసాగారు.
అటు ముగ్గురు పిల్లలు ఆకలితో అల్లాడుతుండటంతో ఆమెకు ఏం చేయాలో తోచలేదు.ఇంటి ముందు వెళ్తున్న వెంట్రుకల వ్యాపారికి ఆమె వెంట్రుకలు అమ్మి రూ.150 తీసుకుంది.రూ.100తో పిల్లల ఆకలి తీర్చింది.కాగా రూ.50తో విషం కొనుక్కుందామనుకుంది.కానీ దుకాణుదారులు ఎవరూ ఆమెకు విషం అమ్మకపోవడంతో గన్నేరు గింజలను మింగే ప్రయత్నం చేసింది.
ఇదంతా గమనించిన ఆమె సోదరి ప్రేమను అడ్డుకుంది.ఈ విషయం గురించి జి.బాల అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
దీంతో ఆమె దీనగాధ గురించి తెలుసుకున్న నెటిజన్లు విరాళంగా ఏకంగా రూ.1.45 లక్షలు సమకూర్చి ఆమెకు అందించారు.అంతేగాక ప్రేమకు వితంతు పెన్షన్ అందేలా ప్రభుత్వంతో మంజూరు చేయించారు.అటు ప్రేమకు జీవనోపాధి కల్పిస్తానని బాల స్నేహితుడు చెప్పడంతో ఇప్పుడు ఆ తల్లి తన పిల్లలను చక్కగా పోషించుకుంటోంది.
అమ్మప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా ఈ ప్రేమ నిలిచింది.