నవమోసాలు మోసి మనల్ని పెంచి ప్రయోజకుల్ని చేసిన తల్లిని వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి భార్యతో కలిసి కన్నతల్లిని చిత్రహింసలకు గురిచేసి చివరికి ఆమె మరణానికి కారణమయ్యాడో కొడుకు.
2018లో దుబాయ్లో జరిగిన ఈ ఘటనలో న్యాయస్థానం భార్యాభర్తలిద్దరికీ పదేళ్ల జైలు శిక్షతో పాటు కారాగారం నుంచి బయటకు వచ్చిన తర్వాత దేశం విడిచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించింది.కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈ జంట దుబాయ్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ను ఆశ్రయించింది.గత ఆదివారం వీరి పిటిషన్ను విచారించిన న్యాయస్థానం కింది కోర్టు శిక్షను సమర్ధిస్తూ తీర్పు చెప్పింది.
భారత సంతతికి చెందిన 29 ఏళ్ల వ్యక్తి అతని భార్యతో కలిసి కన్నతల్లిని తరచూ శారీరకంగా హింసించారు.వాతలు పెట్టడం, ఇష్టమొచ్చినట్లు కొట్టడం వల్ల వృద్ధురాలి పక్కటెముకలు విరిగిపోయాయి.
దీంతో అంతర్గత రక్తస్రావం జరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2018 అక్టోబర్ 31న వృద్ధురాలు కన్నుమూసింది.
ఆమె ఒంటిపై వాతలు, తీవ్రంగా కొట్టిన దెబ్బల గుర్తులతో పాటు కుడికన్ను కనుపాపను కూడా కసాయి కొడుకు కత్తిరించినట్లుగా ఆమెకు చికిత్స అందించిన వైద్యులు తెలిపారు.అంతేకాకుండా చాలా రోజులుగా ఆమెకు ఆహారం పెట్టకపోవడంతో వృద్ధురాలు ఆకలితో అలమటించినట్లుగా పోస్ట్మార్టం నివేదికలో తేలింది.ఆవిడ చనిపోయే నాటికి కేవలం 29 కేజీల బరువు మాత్రమే ఉందట.
పొరుగింట్లో ఉంటున్న మరో భారతీయుడు ఆ పెద్దావిడ పరిస్ధితిని చూసి ఆసుపత్రికి తరలించాడు.ఆసుపత్రి యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అల్ ఖుసైస్ పోలీసులు దర్యాప్తు చేసి భార్యాభర్తలిద్దరినీ జైలుకు తరలించారు.