నిర్లక్ష్యం, మనకేం కాదులే అన్న మితిమీరిన విశ్వాసంతో కొన్ని దేశాలు కరోనాను లైట్ తీసుకుని ఇప్పుడు భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నాయి.చైనా, ఇటలీ, ఇరాన్, స్పెయిన్, అమెరికాలలో ప్రస్తుత పరిస్ధితి ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
అయితే కొన్ని దేశాలు మాత్రం రాబోయే విపత్తును ముందుగానే అంచనా వేసి ప్రజలను, దేశాన్ని కాపాడుకున్నాయి.
ఈ లిస్ట్లో ముందు అన్నిటికంటే ముందుంది రష్యా.
కరోనా మహమ్మారి వ్యాప్తిని, వేగాన్ని దూరదృష్టితో ఊహించిన అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అత్యంత వేగంగా యంత్రాంగాన్ని కదిలించారు.చైనా సహా ఇతర దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులను మూసివేయడంతో పాటు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించారు.
రాజధాని మాస్కోలో ప్రజలపై నిఘా వుంచడానికి సుమారు లక్ష సీసీ కెమెరాల వ్యవస్థ ప్రభుత్వానికి బాగా ఉపయోగపడింది.గత నెలలో వైరస్ బాధిత దేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత.
వేలాది మంది మాస్కో వాసులు 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండిపోయారు.
ఇలా ఇతర దేశాల నుంచి వచ్చి సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్న వారి వివరాలను పోలీసులు ప్రతిరోజూ నమోదు చేసేవారు.అలాగే నగరంలో ఉన్న 16 మిలియన్ల మందితో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల వారు హోమ్ క్వారంటైన్ నిబంధనను ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, విదేశీయులకైతే దేశ బహిష్కరణ విధిస్తామని పుతిన్ హెచ్చరించారు.ఆంక్షల అమలు కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంది.
ఆటోమేటిక్ ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాల ద్వారా మాస్కో అధికార యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచింది.
మాస్కోలో ఇప్పటికే 1,70,000 సీసీ కెమెరాలు ఉండగా.
వీటిలో లక్ష కెమెరాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను అనుసంధానించారు.గత వారం నిర్బంధ హోమ్ క్వారంటైన్ నిబంధనను ఉల్లంఘించిన సుమారు 200 మందిని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు.
కెమెరాలతో పాటు టెలీ మెడిసిన్ సంప్రదింపులు, సోషల్ మీడియా నుంచి తప్పుడు వార్తల గుర్తింపు, తొలగింపు వంటి వాటి కోసం ప్రత్యేకంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందిస్తున్నట్లు రష్యా తెలిపింది.సోమవారం నాటికి రష్యాలో 438 కరోనా కేసులు నమోదవ్వగా.
వీటిలో ఎక్కువ భాగా మాస్కోలోనే చోటు చేసుకున్నాయి.