అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో హిందీ భాష అరుదైన ఘనతను సంపాదించింది.ఆ దేశంలో దాదాపు 9 లక్షల మంది హిందీ మాట్లాడే ప్రజలు ఉన్నట్లు యూఎస్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
అమెరికన్లకు, ఇతర విదేశీ పౌరులకు ఉచిత హిందీ తరగతులు నిర్వహిస్తున్నామని అందువల్లే ఈ గౌరవం దక్కిందని ఇండియన్ ఎంబసీకి చెందిన అధికారి అమిత్ కుమార్ తెలిపారు.
శుక్రవారం వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయంలో జరిగిన విశ్వ హిందీ దివాస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమిత్ మాట్లాడుతూ.అమెరికాలోని పలు పాఠశాలల్లో హిందీని నేర్పుతున్నారని ఆయన తెలిపారు.
అమెరికన్ కమ్యూనిటీ సర్వే (ఎసిఎస్) ప్రకారం… యూఎస్లో తొమ్మిది లక్షల మందికి పైగా హిందీ మాట్లాడేవారు ఉన్నారన్నారు.భారతదేశం ప్రపంచంలోని అతి ముఖ్యమైన దేశాల్లో ఒకటిగా అవతరిస్తున్న ప్రస్తుత తరుణంలో హిందీని నేర్చుకునేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారని అమిత్ వెల్లడించారు.
పర్యాటకం, వ్యాపారం, ఇతర అవసరాల కోసం భారతదేశానికి వెళ్లే వారికి హిందీ నేర్చుకోవడం ద్వారా భారతీయుల హృదయాలను గెలుచుకోవడానికి ఒక మార్గాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.తాను చైనాలో పనిచేస్తున్న సమయంలో చైనీస్ నేర్చుకోవడం వల్ల ఎంతగానో ఉపయోగపడిందని అమిత్ తెలిపారు.భారతీయ కవిత్వం, సాహిత్యం, తత్వశాస్త్రం తెలుసుకోవడానికి హిందీ ప్రవేశద్వారం వంటిదని కుమార్ చెప్పారు.కాగా గత రెండు సంవత్సరాలుగా, భారత రాయబార కార్యాలయం వివిధ దేశాల పౌరులకు హిందీ నేర్పించే మిషన్లో భాగంగా తరగతులను నిర్వహిస్తోంది.
ఇందుకోసం జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ, జార్జ్టౌన్ వర్సిటీ వంటి ప్రఖ్యాత అమెరిక్ విద్యా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.