కోనసీమ జిల్లాను ఎప్పుడైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో అప్పటి నుంచి ఆ ప్రాంతం లో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.మొదట్లో అంబేద్కర్ జిల్లాను చేయాలంటూ జనసేన, టిడిపి వంటి పార్టీల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు జరిగాయి.
ఇంకా ప్రజా సంఘాల నుంచి విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ కోనసీమ జిల్లా సాధన సమితి పేరుతో ఆందోళన కార్యక్రమాలు మొదలయ్యాయి.
ఈ వ్యవహారంలో మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ నివాసాలను అమలాపురంలో దహనం చేశారు.
ఇక అప్పటి నుంచి కోనసీమ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
ఇదిలా ఉంటే అసలు మంత్రి, ఎమ్మెల్యే ఇల్లు , ప్రభుత్వ ప్రైవేటు బస్సుల దహనం చోటు చేసుకోవడానికి కారకులెవరు అనే దానిపైన విచారణ మొదలైంది.సీసీ పుటేజ్ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించారు.
ఇప్పటికే అమలాపురం తో సహా పరిసర గ్రామాలకు చెందిన కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న దాదాపు వెయ్యి మందిని పోలీసులు గుర్తించారు.
వీరిలో 43 మంది కీలక వ్యక్తులు గా పోలీసులు విచారణలో తేల్చి వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.ముఖ్యంగా బిజెపి కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా సుబ్బారావు, కార్యకర్త రాంబాబుతో పాటు, కాపు నేత నల్ల సూర్యచంద్రరావు కుమారుడు అజారు తో సహా 43 మంది పై కేసులు నమోదు చేశారు.
సామర్లకోట కు చెందిన కానిస్టేబుల్ వాసంశెట్టి సుబ్రమణ్యం ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది .అలాగే అమలాపురానికి చెందిన అన్యం సాయి అనే వ్యక్తి పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.ఇప్పటికే అతనిపై రౌడీషీట్ తెరిచారు.ఇక ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న నిందితులపై సెక్షన్ 307, 143, 144, ,147, 148, 151, 152, 332, 336,427,188, 353 ఆర్ / డబ్లూ 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
ఇంకా ఈ రోజు మరిన్ని కీలక అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తోంది.