వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికా వెళ్లిన భారతీయులు అక్కడ అత్యున్నత స్థానాలకు చేరుకుని భారతదేశానికి పేరు తీసుకొస్తుంటే.కొందరు మాత్రం నేరాలకు పాల్పడి జాతి పరువును బజారుకీడుస్తున్నారు.తాజాగా మనీలాండరింగ్తో పాటు ఆయుధాలకు సంబంధించిన నేరాలకు గాను ఓ భారత సంతతి వ్యక్తికి అమెరికా కోర్టు 15 నెలల జైలు శిక్షతో పాటు 4,710 డాలర్ల ( భారత కరెన్సీలో 3.5 లక్షలు) జరిమానా విధించింది.
వివరాల్లోకి వెళితే.ఇండియానాకు చెందిన లవ్ ప్రీత్ సింగ్ ఈ ఏడాది మార్చిలో మనీలాండరింగ్ చేసినట్లు తన నేరాన్ని అంగీకరించాడు.మోసపూరిత పథకాల ద్వారా డబ్బును పొందడంతో పాటు దానిని అక్రమంగా బదిలీ చేసినట్లు లవ్ ప్రీత్ అంగీకరించాడు.దీనితో పాటు చట్టవిరుద్ధంగా తుపాకీని కలిగి వున్నట్లు అతనిపై ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు.
దీనిపై విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం.లవ్ ప్రీత్ సింగ్కు 15 నెలల జైలు శిక్షతో పాటు మనీలాండరింగ్, ఆయుధాల నేరాలకు గాను 4,710 డాలర్ల జరిమానా విధిస్తూ తుది తీర్పు వెలువరించింది.
కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం.లవ్ ప్రీత్ సింగ్ 2015 నుంచి 2018 మధ్యకాలంలో ఈ నేరాలకు పాల్పడ్డాడు.అమెరికాతో పాటు భారత్లో వున్న తొమ్మిది మంది ఇతర నిందితులతో కలిసి మోసాలకు పాల్పడ్డాడు.ప్లాన్లో భాగంగా నిందితులు అమెరికాలోని పలువురు వ్యక్తులకు చెందిన కంప్యూటర్ ఫోన్ నెంబర్లు, ఈ మెయిల్లను సంపాదించారని న్యాయశాఖ తెలిపింది.
అలాగే వరల్డ్ టెక్ అసిస్టెన్స్, యూఎస్ సపోర్ట్ వంటి వ్యాపార సంస్థలను నిందితులు మిస్సిస్సిప్పీలో ఏర్పాటు చేశారు.అనంతరం భారత్లోని కొన్ని కాల్ సెంటర్ల నుంచి అమెరికాకు ఫోన్లు చేసేవారు.
సాంకేతిక సాయంతో ఈ ఫోన్ నెంబర్లు భారత్ నుంచి వచ్చినట్లు కాకుండా అమెరికా టోల్ ఫ్రీ నెంబర్గా కనిపించేలా చేశారు.
ఆ కాల్ సెంటర్ల నుంచి అమెరికన్లకు ఫోన్ చేసి.
మీ కంప్యూటర్లకు మాల్వేర్, ర్యాన్సమ్వేర్ సోకుతున్నాయని.సహాయం కోసం సంప్రదించాల్సిందిగా కొన్ని నెంబర్లు ఇచ్చేవారు.
అంతేకాదు జనాన్ని నమ్మించేందుకు గాను తమను తాము ప్రఖ్యాత టెక్ దిగ్గజాలైన యాపిల్ సపోర్ట్, మైక్రోసాఫ్ట్ సహా కొన్ని దిగ్గజ టెక్నికల్ సపోర్ట్ సర్వీస్లుగా చెప్పుకునేవారు.దీంతో భయపడిన బాధితులు.
వారు చెప్పిన ఖాతాలకు నగదు పంపేవారు.అంతేకాదు తమ బ్యాంక్ ఖాతాలను, కంప్యూటర్లను యాక్సెస్ చేయడానికి బాధితులు అంగీకరించేవారు.
దీనిని అదునుగా చేసుకుని నిందితులు.బాధితుల డబ్బు, ఆస్తులను దోచేసేవారని న్యాయశాఖ తెలిపింది.