పైకి కనిపించకపోయినా అంతర్గతంగా కేంద్ర అధికార పార్టీ బిజెపి తీవ్ర కలవరానికి గురవుతోంది.గతంతో పోలిస్తే ప్రజావ్యతిరేకత పెరిగింది అనే విషయాన్ని గ్రహించింది.
ధరల పెరుగుదల, కరోనా ప్రభావం ఇలా ఎన్నో అంశాలు ప్రజల్లో తమను చులకన చేసేవే అనే భావన కేంద్ర బిజెపి పెద్దల్లో ఉంది.దీనికితోడు వరుసగా వెలువడిన వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురవడం వంటివి మళ్లీ అధికారంలోకి రావడం కష్టమనే సంకేతాలను ఇస్తోంంది.
దీంతో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ఇప్పటి నుంచేే ఆ నష్ట నివారణ చర్యలకు దిగిపోయారు.వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తూ , ఆయా శాఖల్లోని లోటుపాట్లు పైన చర్చిస్తున్నారు.
అలాగే త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించుకున్నారు.దీనిలో భాగంగానే మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తూ వారి పనితీరును విశ్లేషిస్తూ, ఎవరెవరి ని మంత్రివర్గంలో ఉంచాలి మరి ఎవరికి కొత్తగా అవకాశం ఇవ్వాలనే విషయంపైన పూర్తిస్థాయిలో దృష్టి సారించారు.
అలాగే రెండు రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోధీ ని కలవడం చర్చనీయాంశమైంది.ఒకవైపు యోగి ఆదిత్యనాథ్ సీఎం పదవి నుంచి తప్పిస్తారు అనే ప్రచారం జరుగుతుండగా , ఉత్తరప్రదేశ్ నుంచి కొత్తగా ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే విషయంపైనా చర్చించినట్లు తెలుస్తోంది.
గురువారం ప్రధాని నరేంద్ర మోదీ తన ఇంట్లో ఐదు గంటల పాటు కీలక సమావేశాన్ని నిర్వహించారు.
దీంట్లో ఏడుగురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, ప్రకాష్ జావడేకర్ , హర్దీప్ లు ఉన్నారు.మొత్తం 79 మంది మంత్రులను ప్రధాని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండడంతో దాదాపు 20 మంది కొత్త మంత్రులను మోదీ నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే వివిధ రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో ఉన్నా, ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటూ ఉండడంతో అక్కడ ముఖ్యమంత్రులను మార్చే ఆలోచనలో కేంద్రం ఉంది.ఈ విధంగా దేశవ్యాప్తంగా సమూల ప్రక్షాళన చేపట్టి ప్రభుత్వం పెరిగిన వ్యతిరేకతను తగ్గించుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది.
అలాగే వివిధ రాష్ట్రాల్లో బిజెపి అధ్యక్షులను మార్చి కొత్త వారికి అవకాశం కల్పించి, పార్టీపై ఎక్కడా వ్యతిరేకత లేకుండా చేసుకునే దిశగా ముందుకు వెళ్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.