భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలని ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తోన్న ప్రవాస భారతీయులకు నరేంద్రమోడీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో 100 శాతం వాటాలు పొందేందుకు భారత ప్రభుత్వం అనుమతిచ్చింది.
ఇందుకు సంబంధించి కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం వరకు ఎన్నారైలకు 49 శాతం వాటాలు మాత్రమే కొనుగోలు చేసేందుకు అనుమతి ఉంది.అలాగే విమానయాన రంగంలో ప్రభుత్వ అనుమతి మేరకు 49 శాతం మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ)లకు అనుమతి ఉంది.ఎయిరిండియాలో 100 శాతం వాటా విక్రయానికి ప్రాథమిక బిడ్లను కోరుతూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
కాగా సుమారు 12 సంవత్సరాల నుంచి నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాను వదిలించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో భావిస్తోంది.ఈ సంస్థలో తనకున్న వాటా మొత్తాన్ని ఉప సంహరించుకోవాలని నిర్ణయిస్తూ వాటా కొనుగోలుకు ఆసక్తిగల సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) దరఖాస్తులను స్వీకరించడానికి జీఓఎమ్ (మంత్రుల సంఘం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) జనవరిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన గల జీఓఎమ్ ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఎయిరిండియా రుణభారం రూ.60,000 కోట్లను దాటిపోయింది.గత ఆర్ధిక సంవత్సరంలో సంస్థ రూ.8,556.35 కోట్లను నష్టపోయింది.అంతకుముందు ఏడాది దాని నికర నష్టం రూ.5,348.18 కోట్లు.మొత్తం దశాబ్ధకాలంలో ఎయిరిండియా నష్టం రూ.69,575.64 కోట్లు.ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తగిన సంఖ్యలో విమానాలు నడపలేక నష్టాలను మూటగట్టుకుంటోంది.సిబ్బంది కూడా అవసరానికి మించి ఎక్కువున్నారని, అలాగే ఉన్న పైలట్లు, కేబిన్ క్రూ సిబ్బందిని వినియోగించుకోవడంలో వైఫల్యాలు ఎదురవుతున్నాయని కాగ్ ఎత్తిచూపింది.