తనకే సాద్యమయిన నాయకత్వ లక్షణాలతో టీం ఇండియా స్వరూపాన్నేఒకప్పుడు పూర్తిగా మార్చేసిన భారత మాజీ క్రికెట్ కెప్టెన్ ,బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ కి ఇప్పుడు బంపర్ ఆఫర్ వచ్చింది .అది కూడా అలాంటి ఇలాంటి వ్యక్తి దగ్గరి నుండి కాదు .
దేశమంతా భారత భావి ప్రధానిగా భావిస్తున్న బిజేపీ రథ సారధి నరేంద్ర మోడీ నుండి దాదాకి పిలుపు రావడం విశేషం ఈ మధ్య వెలువడిన నాలుగు రాష్ట్రాల ఫలితంతో నరేంద్ర మోడీ విజయం దాదాపు ఖరారు అన్నట్లు ఫీలవుతున్నారు.దేశంలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో గద్దె నెక్కడం ఖాయమని కమలం పార్టీ కాన్ఫిడెంట్ గా ఉంది.
అందువల్ల వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇస్తామని, గెలిస్తే క్రీడా మంత్రి పదవి కూడా ఇస్తామని బిజెపి నాయకత్వం సౌరవ్ గంగూలీకి చెప్పినట్లు సమాచారం.అయితే, దానిపై గంగూలీ ఇంకా ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు.
త్వరలో తన నిర్ణయం చెబుతానని ఆయన అన్నట్లు చెబుతున్నారు.మిత్రుడి ద్వారా గంగూలీ ఢిల్లీలో ఇటీవల బిజెపి నాయకుడు వరణ్ గాంధీని కలిసినప్పటి నుంచి ఆ ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
ఇద్దరికీ తెలిసిన మిత్రుడి ద్వారా గంగూలీ వరుణ్ గాంధీని కలిశారు.బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన వరుణ్ గాంధీ పశ్చిమ బెంగాల్ పరిశీలకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు.
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీయే గంగూలీని రాజకీయాల్లోకి తీసుకురావాలని భావిస్తూ గంగూలీకి బీజేపీ ఆహ్వానం పలికింది.బెంగాల్ లో బీజేపి కి పెద్దగా పట్టు లేకపోవడం తో గంగూలీ చరిష్మా ను వాడుకోవాలని మోడీ భావిస్తున్నట్టు సమాచారం
కాగా ఇంతకు ముందు కొందరు క్రికెటర్లు కూడా రాజకీయాలలోకి వచ్చారు.
నవజోత్ సిద్దూ, కీర్తి అజాద్ వంటివారు వచ్చారు.కాని మంత్రి పదవుల వరకు వెళ్లలేదు.
మరి గంగూలీ అయినా ఆ క్రెడిట్ కొట్టేస్తాడేమో చూడాలి.