ఇప్పటికే పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడం, అధికార పార్టీ టిఆర్ఎస్ జోరు పెరగడం, ఇదే అనువైన సమయంగా భావిస్తూ బిజెపి బలం పెంచుకుంటూ ముందుకు వెళ్తుండడం వంటి పరిణామాలన్నీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కలవరం పుట్టిస్తున్నాయి.పార్టీలో ఉన్న నాయకుల మధ్య సఖ్యత లేకపోవడంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
పార్టీలోని నేతలంతా ఏకాభిప్రాయంతో పార్టీని ముందుకు తీసుకు వెళ్లి పార్టీకి తిరిగి పునర్వైభవం తీసుకు వచ్చే విధంగా ప్రయత్నాలు చేయడం మానేసి, ఒకరిపై ఒకరు గ్రూపు రాజకీయాలకు పాల్పడుతూ వ్యవహరిస్తున్న తీరుతో తెలంగాణలో కాంగ్రెస్ కు తీరని నష్టం కలుగుతోంది.ఈ పరిస్థితి ఇలాగే ఉంటే, ముందు ముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దిగజారే అవకాశం లేకపోలేదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే చాలామంది అధికార పార్టీ టిఆర్ఎస్ లో చేరిపోగా, మిగిలిన కొద్ది మందితోనే పార్టీ ని నెట్టుకొస్తున్నారు.ఈ సమయంలో కాంగ్రెస్ ను వీడేందుకు కీలక నాయకులతో పాటు ఓ ఎమ్మెల్యే సిద్దమవుతుండటంతో ఇప్పుడు టి.కాంగ్రెస్ లో కలకలం సృష్టిస్తోంది.ఎప్పటి నుంచో పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఆయనతో పాటు వరంగల్ డిసిసి అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, మరికొంత మంది పార్టీ నాయకులు అధికార పార్టీ లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు అనే వార్తలతో కాంగ్రెస్ లో కలవరం కలిగిస్తోంది.
వీరితో పాటు మరికొంత మంది నాయకులు కూడా పార్టీని వీడే అవకాశం కనిపిస్తోంది.
అలాగే వరంగల్ డిసిసి అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి, మరికొంతమంది కీలక నాయకులు కూడా పార్టీని వీడాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.వరంగల్ డీసీసీబీ పరిధిలో పార్టీ వ్యవహారాల్లో జనగామ డిసిసి అధ్యక్షుడు జోక్యం ఎక్కువగా ఉందంటూ డిసిసి అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తో భేటీ అయ్యారు.ఇదే సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాజనర్సింహ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయనను బుజ్జగించేందుకు వారు ప్రయత్నించారు.తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని, ఏదైనా ఉంటే పార్టీ కోర్ కమిటీలో మాట్లాడుకుని పరిష్కరించుకుందాం అని చెప్పినట్లు తెలుస్తోంది.అలాగే భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య కు కూడా ఫోన్ చేసి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని విహెచ్ సూచించినట్టు సమాచారం.
మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో అన్ని విషయాల పైన చర్చిద్దామని సూచించినట్లు తెలుస్తోంది.