2014, 2019 సంవత్సరాల్లో వైసీపీ తరపున నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు రోజా.2014 సంవత్సరంలో తక్కువ మెజారిటీతోనే ఎమ్మెల్యేగా గెలిచిన రోజా 2019లో మాత్రం భారీ మెజారిటీని సొంతం చేసుకున్నారు.కేబినేట్ లో రోజాకు చోటు దక్కకపోయినా జగన్ రోజాకు ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి ఇచ్చారు.మరో ఆరునెలల తర్వాత ఏర్పాటు కాబోయే కేబినేట్ లో రోజాకు చోటు దక్కవచ్చని తెలుస్తోంది.
ఒకవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ రోజా బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ కు జడ్జిగా వ్యవహరించడంతో పాటు ఆ ఛానెల్ లో జరిగే ఈవెంట్లలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.అయితే తాజాగా రోజా కొన్ని నిమిషాల పాటు కబడ్డీ ఆడారు.
చిత్తూరు జిల్లాలోని నిండ్ర మండలంలో అంబేద్కర్ కబడ్డీ టోర్నమెంట్ ను రోజా ప్రారంభించారు.అక్కడ కబడ్డీ ఆడుతున్న క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రోజా కొంత సమయం కబడ్డీ ఆడారు.
రోజా బాల్యంలో ఆడిన ఆటలను గుర్తు తెచ్చుకోవడంతో పాటు జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.రోజా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని అన్నారు.కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి స్థానిక వైసీపీ నేతలు కూడా హాజరయ్యారు.మరోవైపు రోజా గత కొన్నేళ్లుగా సినిమాలకు మాత్రం దూరంగానే ఉండటం గమనార్హం.
ఆఫర్లు వస్తున్నా రాజకీయాలతో బిజీగా ఉండటం వల్లే రోజా సినిమాలకు దూరంగా ఉన్నారని తెలుస్తోంది.నగరి నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న రోజా అధికార పార్టీపై విమర్శలు చేస్తున్న వారికి ధీటుగా బదులిస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పై కూడా ఎమ్మెల్యే రోజా ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.చంద్రబాబు ఆదేశాల ప్రకారం నిమ్మగడ్డ ముందుకెళుతున్నారని రోజా విమర్శలు చేశారు.