జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా జరిగిన ఎన్నికల్లో ఊహించని విధంగా దారుణమైన పరాభవాన్ని ఎదుర్కొన్నారు.తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోవడమే కాకుండా కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క స్థానానికి మాత్రమే జనసేన పార్టీ పరిమితం కావడం ఏపీ రాజకీయాల్లో నిజంగా ఎవరు ఊహించని పరిణామం అని చెప్పాలి.
తాజా ఎన్నికల్లో జనసేన పార్టీ ఎంతో కొంత ప్రభావం చూపించి కొన్ని స్థానాలు గెలుచుకుంటుందని రాజకీయ విశ్లేషకులు సైతం భావించారు.అయితే ఊహించని విధంగా జనసేన పార్టీ కేవలం ఓట్లు చీల్చడానికి మాత్రమే పరిమితమైంది.
అయితే 25 ఏళ్ల సుదీర్ఘమైన రాజకీయ లక్ష్యంతో ప్రయాణం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ ఓటమిపై పెద్దగా బాధ పడినట్లు కనిపించలేదు.
ఇదిలా ఉంటే తాజాగా జనసేన పార్టీ ఓటమిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జనసేన పార్టీ ఓటమికి 2009లో ఏర్పడిన ప్రజారాజ్యం పార్టీని కారణమని ఆమె చెప్పుకొచ్చింది.అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ ఎన్నికలలో పోటీ చేసి 18 సీట్లు గెలిస్తే తర్వాత చిరంజీవి పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని కూడా అలాగే చేస్తారనే భయంతో ప్రజలు ఓటు వేయలేదు.చాలా ప్రాంతాల్లో జనసేన పార్టీ బలంగా పోటీ ఇచ్చింది.పవన్ కూడా మంచి పోటీ ఇచ్చారని రోజా చెప్పుకొచ్చింది.అయితే పవన్ కళ్యాణ్ గెలిచి ఉంటే బాగుండేదని, ఓడిపోవడం కొంత బాధ కలిగించిన రాజకీయాల్లో గెలుపోటములు సహజం అనే విషయం అందరూ గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా రోజా చెప్పడం విశేషం.