హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆయన సతీమణి వసుంధరాదేవి హిందూపురం ప్రాంతంలో విస్తృతంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.బెంగళూరు నుండి హిందూపురం విచ్చేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరాదేవికి స్థానిక టిడిపి నాయకులు కర్ణాటక సరిహద్దులో ఘనంగా స్వాగతం పలికారు.
అక్కడి నుండి అప్పలకుంట క్రాసులో ఒక కల్యాణ మండపంలో మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు వివాహ మహోత్సవ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.అనంతరం టిడిపి కార్యకర్తలు నాయకులతో కలిసి రాచపల్లి గ్రామంలో ఎంతో చారిత్రక చరిత్రగల శ్రీఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో చలివేందల గ్రామంలో ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం( సంచార మొబైల్ క్లినిక్) వాహనానికి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ సలహా మేరకు ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఆంధ్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం( సంచార మొబైల్ క్లినిక్) కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.
రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా హిందూపురం ప్రాంతంలో ఉచిత ఆరోగ్య రథం ప్రారంభించడం జరిగిందని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరారు.ఉచిత ఆరోగ్య రథంలో అర్హత గల వైద్య సిబ్బంది సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
ప్రతిరోజు ఏదో ఒక గ్రామాన్ని సందర్శించి అక్కడ ప్రజలకు ఆరోగ్య వైద్య చికిత్స నిర్వహించడం జరుగుతుందన్నారు.మితిమీరిన జబ్బులకు గురి అయిన వారు ఎవరైనా ఉంటే అట్టి వారిని గుర్తించి ప్రభుత్వ కార్పొరేట్ ఆసుపత్రి లేదా బసవ తారక రామారావు క్యాన్సర్ ఆసుపత్రికి రెఫర్ చేయడం జరుగుతుందన్నారు.