టిఆర్ఎస్ లో ఈటెల రాజేందర్ వ్యవహారం కాక రేపుతోంది.ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి అప్పుడే 20 రోజులు అవుతుంది.
ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా ? సొంత పార్టీ పెట్టబోతున్నారా లేక మరేదైనా పార్టీలో ఆయన చేరబోతున్నారా అని సస్పెన్స్ కొనసాగుతూనే వస్తుండగా, టిఆర్ఎస్ మాత్రం రాజేందర్ ను వ్యూహాత్మకంగా దెబ్బకొట్టేందుకు తెరవెనుక ప్లాన్ వేస్తోంది.ముఖ్యంగా ఆయన సొంత నియోజకవర్గమైన హుజురాబాద్ లో ఈటెల కు పట్టు దొరక్కుండా చేయడం ద్వారా ఆయనను ఇరుకున పెట్టాలి అన్నట్లుగా టిఆర్ఎస్ వ్యూహరచనలు చేస్తోంది.
ఈ బాధ్యతలను పూర్తిగా మంత్రి గంగుల కమలాకర్ భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది.కెసిఆర్ ఆదేశాల మేరకు ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి, హుజూరాబాద్ నియోజకవర్గం లోని కీలకమైన టిఆర్ఎస్ నాయకులు అందరితోనూ సమావేశమవుతున్నారు.
ముఖ్యంగా ఈటల వెంట వెళ్తారు అనే అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని కలిసి, వారిని బుజ్జగిస్తూ పార్టీలో ఉంటే రానున్న రోజుల్లో ఏ ఏ ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాన్ని వారికి అర్థమయ్యేటట్లు చెబుతున్నారు.అలాగే ప్రస్తుతం ఆ ప్రజా ప్రతినిధులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుని, వాటికి పరిష్కార మార్గాన్ని చూపిస్తూ, ఈటెల వైపు వెళ్లకుండా మంత్రి కమలాకర్ వ్యూహ రచన చేస్తున్నారు.
అలాగే కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత, మంత్రి కేటీఆర్ తో నియోజకవర్గంలో పర్యటన చేయించేందుకు కమలాకర్ వ్యూహరచన చేశారు.
ఈ సందర్భంగా భారీ స్వాగత ఏర్పాట్లను ఇప్పటి నుంచే కమలాకర్ పర్యవేక్షిస్తున్నారు.
ముఖ్యంగా ఈటెల రాజేందర్ కు ప్రధాన అనుచరులుగా ఉన్న కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, కౌన్సిలర్లతో గంగుల భేటీ అయ్యారు.ఈ సందర్భంగా వారంతా టిఆర్ఎస్ లో ఉండే విధంగా కమలాకర్ ఒప్పించినట్లు తెలుస్తోంది.ఈ వ్యవహారాలు అన్నింటిపైనా ఈటెల రాజేందర్ కాస్త కంగారుగా ఉన్నట్లు తెలుస్తోంది .తన రాజకీయ నిర్ణయం ఏదైనా తన వెంట నడుస్తారని భావిస్తున్న వారందరినీ టిఆర్ఎస్ భయపెడుతూ, బుజ్జగిస్తూ వస్తుండడంపై కాస్త టెన్షన్ పడుతున్నారట.