తెలుగుదేశం పార్టీ కంచుకోటలుగా ఏ నియోజక వర్గాలు ఉన్నాయో, వాటన్నిటి పైనా ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వైసీపీ పార్టీ దృష్టి పెట్టింది.అక్కడ తెలుగుదేశం పార్టీని దెబ్బ తీసి వైసీపీ జెండా రెపరెపలాదించాలి అనే ఏకైక ఉద్దేశంతో ఏపీ సీఎం జగన్ ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తున్నారు.
దీని ద్వారా మొదటి నుంచి టిడిపికి అండగా ఉంటున్న నియోజకవర్గాల ను దూరం చేసి, క్రమంగా తెలుగుదేశం పార్టీని మరింత బలహీనం చేయాలనే లక్ష్యంతో జగన్ ముందుకు వెళ్తున్నారు.ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం లో వైసీపీ మద్దతుదారులను ఎక్కువ గెలిపించుకుని ఆ నియోజకవర్గంలో చంద్రబాబుకు పట్టు తగ్గిందనే విషయాన్ని జగన్ నిరూపించారు.
ఇక మరో కంచుకోటగా అనంతపురం జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం ఉంది.తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి హిందూపురం నియోజకవర్గం లో టీడీపీ తప్ప మరే పార్టీ అక్కడ స్థానాన్ని సంపాదించలేకపోయింది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు టిడిపి తరపున పోటీ చేసిన అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు.
ఇక్కడ 2014 , 19 ఎన్నికల్లోనూ చంద్రబాబు బావమరిది ప్లస్ వియ్యంకుడు అయిన నందమూరి బాలకృష్ణ రెండు సార్లు విజయం సాధించారు.
మరోసారి ఇక్కడ పోటీ చేసేందుకు బాలయ్య ఆసక్తి చూపిస్తున్నారు.అయితే ఆ కంచుకోట ను బద్దలు కొట్టాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది.ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో 38 పంచాయతీలకు గాను, 30 చోట్ల వైసిపి మద్దతుదారులు విజయం సాధించారు.మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్ పి టి సి ఎన్నికలలోనూ ఇదేవిధంగా వైసీపీ జెండా ఎగురవేసి వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి పూర్తిగా తెలుగుదేశం పార్టీకి దెబ్బకొట్టాలి అనే విధంగా ప్లాన్ చేశారు.
అలాగే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన మహమ్మద్ ఇక్బాల్ కు హిందూపురం నియోజకవర్గం ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారు.
అలాగే ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు జగన్ సిద్దమయ్యారు.దీంతో తెలుగుదేశం పార్టీని బలహీనం చేసే విషయంపై దృష్టి సాధించడంతో, బాలయ్య ఆందోళన చెందుతున్నారు.అందుకే తరచుగా ఈ నియోజకవర్గం కు చెందిన కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ, పర్యటన చేస్తూ హడావుడి చేస్తున్నారు.
గతంలో ఈ నియోజకవర్గం పై బాలయ్య అంతంత మాత్రంగానే దృష్టిపెట్టినా, ఇప్పుడు మాత్రం చాలా కంగారు పడుతున్నారట.టిడిపి అధినేత చంద్రబాబు అన్ని నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతూ వస్తున్నా, మొదటి నుంచి హిందూపురం నియోజకవర్గంలో గురించి అంతగా పట్టించుకోవడం లేదు.
ఇక్కడ తెలుగుదేశం పార్టీకి తప్ప మరో పార్టీకి అవకాశం ఉండదని, అదీ కాకుండా, ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా బాలయ్య ఉండడంతో, తన అవసరం పెద్దగా లేదు అన్నట్లు వ్యవహరిస్తూ బాబు వస్తున్నారు.అయితే ఇప్పుడు నెలకొన్న పరిస్థితులతో బాలయ్య ఆందోళన చెందుతున్నారు.అందుకే ఈ నియోజకవర్గంలో చంద్రబాబు పూర్తిగా దృష్టి పెట్టి, తనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తారని, మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేసినా గెలిచేందుకు అవసరమైన ఎత్తుగడలు వేసి, ఈ నియోజకవర్గం ప్రజల్లో టిడిపి కి ఆదరణ తగ్గకుండా చూస్తారని బాలయ్య ఎదురుచూస్తున్నారట.టిడిపి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం లో కనుక పట్టు కోల్పోతే, ఆ నింద తనపై పడుతుందని బాలయ్య ఆందోళన చెందుతుండడంతోనే ఇప్పుడు తన బావయ్య పైనే బాలయ్య ఆశలు పెట్టుకున్నారట.