తనను హత్య చేసేందుకు ఓ మంత్రి ఆధ్వర్యంలో కుట్ర జరుగుతోంది అని, తనను ఎన్ని రకాలుగా అడ్డుకోవాలని చూసినా, తాను భయపడేది లేదని, గతంలో ఉగ్రవాది నయీం తనను చంపుతామని బెదిరించినా తాను బెదరలేదు అనే విషయాన్ని చెప్పిన ఈటల రాజేందర్ పరోక్షంగా మంత్రి గంగుల కమలాకర్ పై అనుమానాలు వ్యక్తం చేశారు.అయితే ఎక్కడా గంగుల కమలాకర్ పేరు ప్రస్తావించకుండానే , తనపై ఓ మంత్రి హంతక ముఠా తో చేతులు కలిపి తన పాదయాత్రను అడ్డుకుని దాడి చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు.
ఈ విషయాన్ని తనకు సమాచారం ఇచ్చారని చెప్పడం తో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిపోయింది.
రాజేందర్ ఓ మంత్రి అన్నారు తప్ప, ఫలానా మంత్రి అని చెప్పకపోవడంతో అందరిలోనూ ఆసక్తి కలిగింది.
అయితే ఈటెల అనుమానాలు వ్యక్తం చేసింది మంత్రి గంగుల కమలాకర్ పైనే అంటూ ఓ రకమైన ప్రచారం మొదలవడంతో, దీనిపై ఓ మీడియా ఛానల్ కు మంత్రి గంగుల కమలాకర్ వివరణ ఇచ్చారు.ఈటల చేస్తున్న ఆరోపణలన్ని అబద్ధాలేనని , హుజురాబాద్ ఎన్నికల్లో సానుభూతి కోసమే ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారని గంగుల మండిపడ్డారు.
ఈటెల రాజేందర్ది దిగజారుడు రాజకీయము అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.బిజెపి లో ఉన్న ఈటెల హత్య కుట్రపై అవసరమైతే సీబీఐ , ఎన్ ఐ ఎ తో విచారణ జరిపించుకోవచ్చని, తాను సిద్ధంగానే ఉన్నాను అంటూ సవాల్ విసిరారు.
కేంద్రంతో చెప్పి వెంటనే ఈ ఆరోపణలపై ఈటెల రాజేందర్ విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలని పట్టుబట్టారు.ఇప్పటికే టీఆర్ఎస్ ఈటెల ను టార్గెట్ చేసుకుంటూ అనేక రాజకీయాలకు పాల్పడుతూ ఉండగా అంతే స్థాయిలో రాజేందర్ బిజెపి సహకారంతో టిఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు .ఈ క్రమంలోనే ఈ హత్యకు కుట్ర వ్యవహారం తెరపైకి రావడం రెండు పార్టీల మధ్య మరింత అగ్గి రాజేసినట్టు గా కనిపిస్తోంది.