వీసా జారీ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందని పలువురు విద్యార్ధులు ఫిర్యాదు చేయడంతో కేంద్ర విదేశాంగ శాఖ రంగంలోకి దిగింది.దీనిలో భాగంగా శుక్రవారం ఢిల్లీలోని అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీలు సహా ఎనిమిది దేశాలకు చెందిన రాయబారులు, డిప్యూటీ చీఫ్లను పిలిపించి మాట్లాడింది.
ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు.ప్రస్తుతం విద్యార్ధులు విదేశీ విద్యపై ఆసక్తి చూపుతున్నందున .వీసా జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని భారత్ కోరిందని, దీనికి వారు అంగీకరించారని బాగ్చి తెలిపారు.
వాస్తవానికి వీసాలు మంజూరు చేయడం అనేది ఒక దేశ సార్వభౌమాధికార నిర్ణయంగానే అంతర్జాతీయ సమాజం పరిగణిస్తుంది.
అందుకే సాధారణంగా విదేశీ దేశాల వీసా సమస్యలలో భారత్ ఎన్నడూ జోక్యం చేసుకోలేదు.అయితే వీసాల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోందని.సమస్యను పరిష్కరించాల్సిందిగా విద్యార్ధుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞాపనలు రావడంతో భారత ప్రభుత్వం రంగంలోకి దిగాల్సి వచ్చిందని విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి.
అకడమిక్ ప్రోగ్రామ్ల కోసం ఇప్పటికే ఫీజులు చెల్లించిన విద్యార్ధులకు వీసా స్లాట్లు అందుబాటులో లేకపోవడంతో ఆయా దేశాల ఎంబసీలు, హైకమీషన్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.అక్కడ స్పందన లేకపోవడంతో వారు విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేశారని అధికారులు చెబుతున్నారు.అయితే పర్యాటకం, టూరిజం, ఉపాధి, వ్యాపార ప్రయాణాలకు సంబంధించిన వీసా మంజూరు ప్రక్రియపై కోవిడ్ మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిందని ఓ అధికారి జాతీయ మీడియాతో తెలిపారు.
పరిమిత వనరులతో పాటు ఆయా దేశాల్లో సిబ్బంది కొరత కారణంగా వీసా దరఖాస్తు ప్రక్రియల ప్రాసెసింగ్ చేయలేకపోతున్నామని ఆయన చెప్పారు.
భారతీయులకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం డెస్టినేషన్లుగా వున్న అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే, జర్మనీ యంత్రాంగాలపై భారం ఎక్కువగా వుంది.
జూలై 2021లో కేంద్ర విదేశాంగ శాఖ పార్లమెంట్కు తెలిపిన వివరాల ప్రకారం.అమెరికాలో 2,11,930 మంది, యూకేలో 55,465 మంది, ఆస్ట్రేలియాలో 92,383 మంది, కెనడాలో 2,15,720 మంది, జర్మనీలో 20,810 మంది భారతీయ విద్యార్ధులు వున్నారు.