కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఏపీ కాంగ్రెసు నాయకులపై మండిపడుతున్నారు.‘ఏందబ్బయా…ఈ పని?’ అని ఆగ్రహిస్తున్నారు.ఇంతకూ కాంగ్రెసు నాయకులు ఏం చేశారు? భాజపా నాయకులు ఎన్నికల ప్రచారంలో, అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఊదరగొట్టారు.గట్టిగా హామీ ఇచ్చారు.
రాష్ర్ట విభజన సమయంలో పార్లమెంటులోనూ అప్పటి యూపీఏ ప్రభుత్వంతో ప్రత్యేక హోదాపై వాదులాడారు.ఐదేళ్లు కాదు పదేళ్లు ఇవ్వాలన్నారు.
కాని అధికారంలోకి వచ్చిక క్రమంగా మొండిచేయి చూపించారు.ప్రత్యేక హోదా కావాలంటూ పోరాటాలు చేస్తున్న కాంగ్రెసు నాయకులు చివరకు మాట ఇచ్చి నిలబెట్టుకోని ప్రధాని మోదీ మీద, వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద పోలీసు స్టేషన్లో పిర్యాదు చేశారు.
కాంగ్రెసు నాయకులు ఇలా చేయడాన్ని వెంకయ్య చీప్ ట్రిక్గా, పిచ్చితనంగా అభివర్ణించారు.దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఏర్పడిన ప్రభుత్వాలు తమ హామీలన్నీ నెవరేర్చాయా? అని ప్రశ్నించారు.ఆకాశంలో మబ్బులు పట్టి సూర్యుడు ఉదయించకపోతే కూడా కాంగ్రెసు నాయకులు కేసులు పెట్టేలా ఉన్నారని ఎద్దేవా చేశారు.వారు ప్రస్తుతం నిరాశలో ఉన్నారని అన్నారు.కాంగ్రెసు నాయకులు తమ నిరసనలో భాగంగా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.దీనివల్ల వెంకయ్యకు ఏమీ కాదు.
కాంగ్రెసువారు నిరసన వ్యక్తం చేస్తేనే పిచ్చితనమన్న వెంకయ్య ఇచ్చిన మాటను తప్పి ప్రజలను మోసం చేశారు.దీన్ని ఏమంటారు? చీటింగ్ అంటారు కదా….! ఇచ్చిన హామీ ఎందుకు నెరవేర్చలేదో ప్రజలకు వివరిస్తే ఆయన పెద్దరికం నిలబడుతుంది.