ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు పాత ప్రభుత్వానికే అధికారం ఉంటుంది.కాకపోతే ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం మాత్రమే.
అయితే గత కొద్ది రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబు కి చీఫ్ సెక్రటరీ ఎల్వీ ప్రసాద్ కి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది.మీకు ఫలానా అధికారం లేదు అంటూ సీఎస్ ఆంక్షలు పెడుతుండడం బాబు కి ఏ మాత్రం నచ్చడం లేదు.
జూన్ వరకు మా ప్రభుత్వానికి అధికారం ఉంది.మీ నియమ నిబంధనలు నా దగ్గర పనిచేయవు అంటూ బాబు అధికారుల మీద ఒంటికాలిపై లేస్తుండడం చూస్తూనే ఉన్నాం.
ఇక టీడీపీ గవర్నమెంట్ కు ఛాన్స్ లేదని, రాబోయేది వైసీపీ గవర్నమెంట్ అని అంచనాకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు కొందరు అప్పుడే మంత్రులకు ఝలక్ ఇవ్వడం స్టార్ట్ చేశారు.
తాజాగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్షకు అధికారులు ఒక్కరంటే ఒక్కరు కూడా హాజరుకాకపోవడం చర్చనీయాంశం అయ్యింది.
రాష్ట్రంలో అకాల వర్షాలు, కరువు పరిస్థితులపై సమీక్షా సమావేశానికి హాజరుకావాలంటూ వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ప్రత్యేక కమిషనర్ మురళీధర్రెడ్డికి మంత్రి కార్యాలయం సమాచారం కూడా అందించింది.మీటింగ్ సమయం ఉదయం 11 గంటలా 30 నిమిషాలకు మంత్రి సోమిరెడ్డి సచివాలయానికి వచ్చారు.3 గంటల పాటు వేచి చూసినా అధికారులు మాత్రం సమావేశానికి హాజరుకాకపోవడం సోమిరెడ్డికి చిర్రెత్తుకొచ్చి అక్కడి నుంచి అకస్మాత్తుగా వెళ్లిపోయారు.
అయితే సమీక్షా సమావేశానికి సంబంధించిన స్పష్టత కోసం అధికారులు ఈసీని సంప్రదించినట్లు తెలుస్తోంది.
దీంతో సమావేశానికి అధికారులు రాలేదు.దీంతో అధికారుల కోసం చాలా సమయం వేచి చూసిన మంత్రి సోమిరెడ్డి అసహనంతో వెనుదిరిగారు.
తన సమీక్షను అడ్డుకుంటే మంత్రి పదవి నుంచి తప్పుకుంటానని అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తానని గత కొద్ది రోజుల క్రితమే సోమిరెడ్డి ప్రకటించారు.దీంతో ఇవాళ్టి సమీక్షా సమావేశం జరగకపోవడంతో మంత్రిగారు ఏ స్టెప్ తీసుకుంటారో అన్న ఆసక్తి అందరిలోనూ కలుగుతోంది.
ప్రస్తుతం ఈ విషయాన్ని టీడీపీ చాలా సీరియస్ గా తీసుకోవాలని భావిస్తోంది.