సూటిగా సంచలన వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడూ ముందుండే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి మరోసారి తనదైన శైలిలో టిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో హరీష్ రావును తిరగనివ్వను అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇంతకీ విషయం ఏంటి అంటే, సింగూరు నీటి తరలింపు కారణంగా సంగారెడ్డి జిల్లా తో పాటు మెదక్ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని జగ్గారెడ్డి మీడియా సమావేశంలో లేవనెత్తారు.సింగూరు నీటి తరలింపు సమయంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని, దానికి ముఖ్య కారణం మంత్రి హరీష్ రావు అనాలోచిత నిర్ణయం కారణమని జగ్గారెడ్డి ఆరోపణలు చేశారు.
నీటి తరలింపు వల్ల సంగారెడ్డి జిల్లాతో పాటు మెదక్, ఘనపూర్ ఆయకట్టు రైతులకు, మెదక్ మున్సిపాలిటీకి సక్రమంగా నీరు అందడం లేదని, దీనికి హరీష్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.నీటి సమస్య తీరే వరకు, అలాగే దీనిపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు హరీష్ రావును మెదక్, సంగారెడ్డి జిల్లాలో తిరగనివ్వబోమంటూ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.
అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులంతా ప్రజా సమస్యలను పట్టించుకోవడం మానేసి హరీష్ రావు ఇంటివద్ద భజన చేస్తున్నారు అంటూ ఆయన విమర్శలు చేశారు.